ఈ మధ్య కాలంలో సినిమా వసూళ్ళు భారీగా రావాలంటే చాలా కష్టమయిపోయింది. ఆ సినిమా కథ, మ్యూజిక్, హీరో ఇన్ని చూసుకునిగాని ప్రేక్షకుడు సినిమాకి వెళ్ళడం లేదు. అన్నీ బావుండి సినిమా హిట్ అయి మంచి కలెక్షన్లుకొట్టిందంటే అది మాములు విషయం కాదనే చెప్పాలి. అలాగే ఇటీవలె వచ్చే సినిమాలు ఒక వారం, నెల రోజులు ఒక థియేటర్ని అంటిబెట్టుకుని ఉండడం అంటే చాలా కష్టం అలాంటిది రోజులు తరబడి ఆ సినిమాలు థియేటర్లను అంటిపెట్టుకోవడం ఇంకా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఈ సంక్రాంతికి విడుదలైన 'సరిలేరు` 'అల' రెండు చిత్రాలు అసలు సిసలైన పండగ వాతావరణాన్ని తీసుకువచ్చాయని చెప్పాలి.
ఈ రెండు సినిమాలు ఇక థియేటర్ల నుంచి వెళ్ళిపోయాయి అనుకుంటే పప్పులో కాలేసినట్టే. కానీ ఇంకా అక్కడక్కడా థియేటర్లలో ఈ రెండు సినిమాలు ఆడుతున్నాయి. డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లోకి వచ్చిన తర్వాత ఎవరు థియేటర్ లో చూస్తారని అనుకోవచ్చు కానీ 100 రోజుల రికార్డు కోసమని ఇలా కొన్ని చోట్ల సినిమాలను ఇంకా రన్ చేస్తూనే ఉన్నారట. ఎలాగైనా సినిమా థియేటర్ లో ఉన్నప్పుడు చూసేవారు కొందరైనా ఉంటారు కదా. అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చిన అసలు చిక్కంతా ఎక్కడ ఉందంటే... మాయదారి కరోనా వైరస్ పుణ్యమా అంటూ థియేటర్లున్నీ మూతపడుతున్నాయి. దీంతో ఈ 100 రోజుల రికార్డులు సంగతి మరి ఇక కష్టమనే చెప్పాలి. ఈ రెండు సినిమాలే కాదు. 'భీష్మ' 50 రోజుల రికార్డు కూడా కరోనా దెబ్బకు మిస్ అయినట్లే. ఎందుకంటే సినిమా హాల్స్ రీ ఓపెన్ చేసే సమయానికి కొత్త సినిమాలు వచ్చేస్తే ఇక నితిన్ 'భీష్మ' కు అవకాశం ఎక్కడ ఉంటది.
అయినా సరే 100 రోజుల రికార్డులు వేసుకుంటామని ఒకవేళ పట్టుబడితే అవి కాస్తా 'నాన్ - బాహుబలి రికార్డు' ల తరహాలో 'విత్ కరోనా 100 రోజుల రికార్డు' అని కొత్త రికార్డుని పుట్టించి మరీ చెప్పుకోవాలి. మొత్తానికి ఈ వందరోజుల రికార్డులకు పూర్తిగా మంగళం పాడడానికే చైనా వారు మనకు కరోనాను ఎగుమతి చేసినట్లున్నారు. ఎంతసేపటికి చైనా వస్తువులే కాదు. జబ్బులను కూడా మీరు పంచుకోవాలంటూ మనకు ఈ కరోనాని పంపించినట్లుంది.