కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సినిమాల ప్రదర్శనతో పాటు షూటింగ్లను కూడా బంద్ అవుతున్నాయి. మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు షూటింగ్లకు అనుమతిచ్చే అవకాశాలు కనిపించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో చిత్రాల ప్రదర్శనలతో పాటు షూటింగులను కూడా ఆపివేయాలని ఆదివారం తెలుగు ఇండస్ట్రీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తమిళ చిత్రాల షూటింగ్స్ కూడా ఆగిపోనున్నాయి. ఈ నెల 19 నుంచి షూటింగ్స్ని ఆపివేస్తామని ‘ఫెఫ్సీ’ (దక్షిణ చలన చిత్ర కార్మికుల సమాఖ్య) సోమవారం ప్రకటించింది. ‘‘భారీ నష్టం జరుగుతుంది. అయితే ఒక సమస్య వచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగా ఉండాలి. నిర్ణయాలకు కట్టుబడాలి. మా కార్మికుల క్షేమమే మాకు ముఖ్యం అని వెల్లడించింది.
నిర్మాతలు, సాంకేతిక నిపుణులందరూ మా నిర్ణయాన్ని ఆమోదించి ఈ 19 నుంచి షూటింగ్స్ ఆపివేయాలని విన్నవించుకుంటున్నాం’’ అని ‘ఫెఫ్సీ’ అధ్యక్షుడు, దర్శకుడు ఆర్.కె. సెల్వమణి తెలిపారు. సినిమా షూటింగ్స్ మాత్రమే కాదు టీవీ కార్యక్రమాలు, వాణిజ్య ప్రకటనల చిత్రీకరణను కూడా నిలిపివేయమని కోరారు. మళ్లీ షూటింగ్లు ఎప్పుడు మొదలుపెట్టాలన్నది పరిస్థితులను బట్టి నిర్ణయిస్తామని కూడా పేర్కొన్నారు. కరోనా కారణంగా ఇప్పటికే విక్రమ్ ‘కోబ్రా’, అజిత్ ‘వలిమై’, శింబు ‘మానాడు’ చిత్రాల విదేశీ షెడ్యూల్స్ రద్దయ్యాయి. అన్ని చిత్రాల షూటింగ్స్ నిలివేయాలని సోమవారం తీసుకున్న నిర్ణయంతో ఇక్కడ తెలుగు స్టూడియోలు ఖాళీగా ఉన్నట్లే తమిళ స్టూడియోలు కూడా ఖాళీగా ఉండబోతున్నాయి. ఇక కేళలలోనూ సినిమా షూటింగులు, చిత్ర ప్రదర్శనలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.. ఏదేమైనా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సినీ పరిశ్రమలకు భారీ నష్టాలు వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయని పలువురు ప్రముఖులు పేర్కొంటున్నారు. అదే సమయంలో కరోనా వైరస్ పై ప్రజల్లో నెలకొన్న భయాలను పోగొట్టేందుకు పలువురు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. అవగాహనతోనే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని అవగాహన కల్పిస్తున్నారు.