భానుమతి పేరు చెబితే ఇట్టే అర్ధమైపోతుంది.. ఆమె ఒక బహుముఖ ప్రజ్ఞాశాలని. అణువంత అహంకారం.. కొండంత ఆత్మవిశ్వాసం.. కలగలిస్తే భానుమతీ రామకృష్ణ అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, గాయనిగా, రచయిత్రిగా, సంగీత దర్శకురాలిగా ఇలా పలు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి అరుదైన మహిళగా గుర్తింపు తెచ్చుకున్న భానుమతి గురించి ఎంత చెప్పకున్నా తక్కువే. మరియు ఈమె అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ విజయాలు సాధించగలిగింది.
ఈమె తండ్రి బొమ్మరాజు వెంకట సుబ్బయ్య శాస్త్రీయ సంగీత కళాకారుడు. తండ్రి దగ్గర సంగీతం అభ్యసించిన ఆమె పదమూడేళ్ళ వయసులోనే వరవిక్రయం అనే సినిమాలో నటించి మెప్పించింది. తన 53 ఏళ్ల సినిమా కెరీర్లో తెలుగు , తమిళం, హిందీ భాషల్లో కలిపి దాదాపు 150 చిత్రాల్లో నటించారు. అయితే ఆమె 1943, ఆగష్టు 8 న నిర్మాత, డైరెక్టరు, ఎడిటరు అయిన శ్రీ పి.యస్. రామకృష్ణారావును ప్రేమ వివాహమాడినది. వీరి ఏకైక సంతానం భరణి. ఈ భరణి పేరుమీదనే భరణీ స్టూడియో నిర్మించి, అనేక చిత్రాలు ఈ దంపతులు నిర్మించారు.
ఇక 1953లో భర్త ప్రోత్సాహంతో ‘చండీరాణి’ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మించి తొలి మహిళా దర్శకురాలిగా రికార్డు సృష్టించింది. ఆ తర్వాత ఆమె విచిత్ర వివాహం, అమ్మాయి పెళ్లి, మనవడి కోసంవంటి చిత్రాలు రూపొందించి దర్శకురాలిగా మంచి ముద్ర వేసింది. అదేవిధంగా, భరణీ పిక్చర్స్ సంస్థ బ్యానర్ మీద విప్రనారాయణ, బాటసారి వంటి అజరామర మైన చిత్రాలు నిర్మించినా తరవాత ‘అంతా మనమంచికే’ చిత్రాన్ని నిర్మించింది.
ఈ చిత్రానికి కథ, స్కీన్ర్ ప్లే, దర్శకత్వం నిర్వహించడం తోబాటు సంగీత దర్శకుడు చెల్లపిళ్ళ సత్యం సహకారంతో సంగీత దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక చివరిసారి ఆమె దర్శకత్వం వహించిన చిత్రం అసాధ్యురాలు. ఈ క్రమంలోనే ఈమె అందుకున్న పురస్కారాలు ఎన్నో ఎన్నెన్నో..!