సమంత.. తెలుగింటమ్మాయిగా మారిపోయిన కేరళ పిల్ల..అక్కినేని వారింటి కోడలయ్యింది. నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సమంత కేరీర్ లో దూసుకుపోతోంది. బ్లాక్ బ్లస్టర్ హిట్లు అందుకుంటోంది. పెళ్లయ్యాక హీరోయిన్ల చాప్టర్ క్లోజ్ అనే పాత చింతకాయ పచ్చడి సాంప్రదాయాన్ని మార్చేసింది.. తనకు నచ్చినట్టు తాను ఉంటోంది. తన ఆత్మవిశ్వాసం, ఫ్యామిలీ సపోర్ట్ వల్లే ఇదంతా సాధ్యమైందని సమంత నమ్ముతోంది.
ఎందుకంటే.. సమంత 2019 ‘హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమన్’ జాబితాలో సమంత అగ్ర స్థానంలో నిలిచింది. ఆన్లైన్ పోలింగ్ లో పబ్లిక్ ఆమెకు ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు. ఇండస్ట్రీలో అదిరిపోయే అందాలున్న కొత్త హీరోయిన్లు వచ్చినా.. పెళ్లయినా ఇంకా సమంత క్రేజ్ తగ్గలేదని ఈ పోల్ తో మరోసారి రుజువైంది. అసలు ఈ రిజల్ట్ చూసి తానే నమ్మలేకపోయానంటోంది సమంత.
తన పేరు మొదటి స్థానంలో ఉండటం చూసి ఆశ్చర్యపోయానంటోంది. నా పేరు టాప్లో ఉండటం చూసి షాక్ అయ్యా.. కానీ గొప్పగా అనిపించింది. ఓ పెళ్లైన మహిళకు ఈ టైటిల్ రావడం మంచి పరిణామం. సమాజంలోని మార్పును ఇది సూచిస్తోంది. పెళ్లైన నటి అని తేడా చూపించకుండా ప్రతిభను గుర్తించారు. ఈ విషయం చైతన్యకు చెప్పినప్పుడు ‘ఏంటి?’ అని ఆశ్చర్యపోయాడు. కొన్ని నిమిషాలకు ‘నిజంగా?.. నీకు పెళ్లైంది కదా!’ అన్నాడని గుర్తు చేసుకుంది.
ఇదే సమయంలో పెళ్లయిన కొత్తలో తనకు ఎదురైన చేదు అనుభవాలను సమంత గుర్తు చేసుకుంది. తాను పెళ్లి తర్వాత ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఫొటో చూసి నెటిజన్లు తనను ఘోరంగా తిట్టారని చెబుతోంది. సమంతా.. పెళ్లయ్యాక కూడా అలా తొడలు చూపించేలా ఫోటోలు ఏంటని కామెంట్ చేశారట చాలా మంది. కానీ తాను బెదరకుండా అలాగే తనకు నచ్చినట్టు ఉండటం మొదలయ్యాక ఆ కామెంట్లు తగ్గిపోయాయని గుర్తు చేసుకుంది సమంత.