కరోనా ఎఫెక్ట్ తో ప్రపంచమంతా స్థంబించి పోయింది. ఇప్పటికే మన దేశంలో కూడా దీని ప్రభావం భారీగా కనిపిస్తోంది. చాలా రాష్ట్రాల్లో విద్యా సంస్థలు మూసి వేశారు. వైరస్ నివారణకు కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో వైరస్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. దీంతో ముంబై, పూణేలలో దాదాపు కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. దాదాను అన్ని కార్యాలయాలతో పాటు జిమ్, స్విమ్మింగ్ పూల్స్ లాంటివి కూడా మూసేశారు. అయితే ఈ నేపథ్యంలో ఓ స్టార్ హీరో అత్యుత్సాహం అతడిని చిక్కులో పడేసింది.
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్కు మున్సిపల్ కార్పోరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నిషేదం ఉన్న నేపథ్యంలో ఓ జిమ్లో కసరత్తులు చేసినందుకు గానూ షాహిద్కు నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు షాహిద్ వెళ్లిన జిమ్ను కూడా సీజ్ చేశారు మున్సిపల్ అధికారులు. ఇటీవల ముంబై నగరపాలక సంస్థ నగరంలోని అన్ని జిమ్ లను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మూసి వేయాలని చెప్పింది. అయితే ఆ ఆజ్ఞలను బేఖాతరు చేసినందుకు గానూ షాహిద్, జిమ్ యాజమాన్యంపై ముంబై నరగపాలక సంస్థ చర్యలకు సిద్ధమైంది.
జిమ్కు షాహిద్ వెళ్లినప్పుడు అతనితో పాటు ఆయన భార్య మీర కపూర్ కూడా ఉంది. వీరిద్దరు జిమ్ నుంచి తిరిగి వస్తుండగా తీసిన ఫోటో వైరల్ కావటంతో అది ఎమ్సీజీఎమ్ దృష్టికి వెళ్లింది. అయితే జిమ్ యజమాని యుధిసటర్ జైసింగ్ ఈ ఘటనపై స్పందించారు. ఇటీవల జెర్సీ సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడ్డ షాహిద్, గాయం నుంచి త్వరగా కోలుకునేందుకు కొన్ని ఎక్సర్సైజ్లు గురించి తెలుసుకునేందుకే షాహిద్ జిమ్కు వచ్చినట్టుగా వెల్లడించాడు. ఇటీవల కబీర్ సింగ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న షాహిద్ ప్రస్తుతం మరో రీమేక్ జెర్సీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.