కరోనా మహమ్మారి సెలబ్రిటీలను కూడా వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే దేశాధినేతలతో పాటు పలువురు సినీ టెలివిజన్ తారలకు ఈ కరోనా వైరస్ సోకినట్టుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ లిస్ట్లోకి మరో నటి కూడా చేరింది. గేమ్ ఆఫ్ త్రోన్స్ టెలివిజన్ సిరీస్లో నటించిన భారతీయ మూలాలున్న నటి ఇందిరా వర్మ కు కరోనా సోకింది. 2014 నుంచి 2017 వరకు ప్రసారం అయిన గేమ్ ఆఫ్ త్రోన్స్ ఎపిసోడ్స్ లో ఎల్లారియా సాండ్ పాత్రలో నటించింది ఇందిరా.
ప్రస్తుతం స్టేజ్ షోస్ లో నటిస్తున్న ఇందిరా.. బుధవారం థియేటర్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా పేజ్లో షేర్ చేసింది. కరోనా విజృంభన కారణంగా షో ఆగిపోయినట్టుగా తెలిపింది ఇందిరా. అంతేకాదు కరోనా కారణంగా తాను అనారోగ్యం పాలైనట్టుగా కూడా ఆమె వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమె ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో షోస్ క్యాన్సిల్ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. త్వరలోనే తిరిగి ప్రేక్షకుల ముందుకు వస్తామని ఆశాభావం వ్యక్తం చేసింది ఇందిరా.
గేమ్ ఆఫ్ త్రోన్ లోనే నటించిన క్రిస్టోఫర్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. సోమవారం తన ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా అభిమానులకు ఈ విషయాన్ని వెల్లడించాడు క్రిస్టోఫర్. `నార్వే నుంచి మాట్లాడుతున్నా.. మీ అందరికీ ఈ విషయం తెలియజేయడానికి బాధగా ఉంది. ఈ రోజు నేను చేయించుకున్న పరీక్షల్లో కోవిడ్ 19 పాజిటివ్ అని తేలింది` అంటూ అభిమానులకు తెలియజేశాడు.