మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్.. వీరి మధ్య బంధం ఎలాఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరసకు ఇద్దరూ బావ, బావ మరుదులు అయినా ఎంతో స్నేహంగా ఉంటారు. ఇక గీతాఆర్ట్స్లో చేసిన సినిమాల్లో 90 శాతం చిరంజీవితోనే. బయట అశ్వనీదత్ కు తప్ప మరెవరికీ చిరంజీవి కాల్షీట్స్ దొరకని పరిస్ధితిని సృష్టించింది అల్లు అరవిందే. కథ దగ్గర నుంచి దర్శకుడి వరకు, క్యారెక్టర్ ఆర్టిస్టు నుంచి హీరోయిన్ల వరకు ఎంపిక అధికారం అల్లుదే. చిరంజీవికి వచ్చే పారితోషికాన్ని పెట్టుబడులుగా మార్చే బాధ్యత కూడా బామ్మర్దిదే. అయితే చిరు రీఎంట్రీ తర్వాత పరిస్థి మారిపోయింది.
చిరంజీవి ఎవరికీ దొరకడం లేదు. ఒక్కరికి కూడా డేట్స్ ఇవ్వట్లేదు మెగాస్టార్. రీ ఎంట్రీ సినిమాకు ఉన్న డిమాండ్ క్రేజ్ దృష్టిలో పెట్టుకుని అప్పటికప్పుడు కొడుకును నిర్మాతని చేసి కొణిదెల ప్రొడక్షన్ స్థాపించాడు మెగాస్టార్. "ఖైదీ నెం.150" సినిమాకు కోట్లకు కోట్ల లాభాలు అందుకున్నాడు చరణ్. ఇక ఆ వెంటనే మళ్ళీ మెగాస్టార్ తో పాన్ ఇండియా మూవీ 'సై రా నరసింహరెడ్డి' సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందించాడు. కానీ, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడడంతో ఇక నిర్మాణంలోకి దిగడు అని అందరూ అనుకున్నారు.
అయితే అందుకు భిన్నంగా చిరంజీవి, కొరటాల శివ సినిమాను కూడా మాట్నీ ఎంటర్టైన్మెంట్ వారితో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాడు రామ్ చరణ్. దీంతో అల్లు అరవింద్కు చిరంజీవి సినిమా నిర్మించే ఛాన్స్ కూడా దొరకడం లేదు. ఇలా రీఎంట్రీ దగ్గర నుండి ఇంతవరకు వీళ్ళ కాంబినేషన్ కుదరలేదు. ఇక తాజా కథనాల ప్రకారం మెగాస్టార్ నెక్స్ట్ సినిమా మైత్రి మూవీ మేకర్స్ వారితో కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ విధంగా చూసుకుంటే చిరంజీవి, రాంచరణ్ లు అల్లు అరవింద్ ను కావాలనే అవాయిడ్ చేస్తున్నారని టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది. ఇక ప్రస్తుత పరిస్థితులు బట్టీ అరవింద్ నిర్మాణంలో చిరు సినిమా మాత్రం ఇప్పుడుప్పుడే రాదని కూడా స్పష్టంగా అర్థం అవుతోంది.