రాజమౌళి సినిమాలంటే ఓ ప్రత్యేకత ఉంటుందన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో ఆయనతో ఒక్క సినిమాలో నటిస్తే చాలు అనుకున్న హీరోలు ఎంతో మంది ఉన్నారు. అలాంటిది రాజమౌళితో నాలుగోసారి ఎన్టీఆర్... రెండోసారి రామ్ చరణ్ నటిస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెం.1, సింహాద్రి, యమదొంగ తో సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఇక రామ్ చరణ్ తన రెండో సినిమా ‘మగధీర’ తో రికార్డుల మోత మోగించాడు. ఈ ఇద్దరు హీరోలను కలిపి ఒక స్క్రీన్ పై చూపించబోతున్నారు రాజమౌళి. ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్ అంటూ వచ్చిన వార్తలకు ఇప్పుడు శుభం కార్డు పడింది.. ఉగాది పండుగ సందర్భంగా ఈ మూవీ టైటిల్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.
పలు భాషల్లో ఆర్ఆర్ఆర్ టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ లను విడుదల చేశారు. ఈ సినిమాకు 'రౌద్రం.. రణం.. రుధిరం' పేరు పెట్టారు. రౌద్రం రణం రుధిరం రిలీజ్ చేశారు. ఈ మోషన్ మోస్టర్ లో హీరోలను నిజంగానే ఎంతో రౌద్రంగా కనిపిస్తున్నారు. ఇద్దరు హీరోలను ఎక్కడా తగ్గకుండా చూపించబోతున్నట్లు కనిపిస్తుంది. నీటీ నుంచి ఎన్టీఆర్.. నిప్పు నుంచి రామ్ చరణ్ ని చూపిస్తున్నారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన అల్లూరి సీతారామరాజు మరోవైపు తెలంగాణకు చెందిన కొమరం భీమ్లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే కల్పిత కథతో ఈ సినిమాను తీస్తున్నారు.
బాహుబలి తర్వాత రాజమౌళి తీస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మోషన్ పోస్టర్లో కీరవాణి ఇచ్చిన నేపథ్య సంగీతం, బీజిఎమ్స్ రోమాంచితంగా వున్నాయి. సినిమాలో ఆయన తన నేపథ్య సంగీతంతో మరోసారి `బాహుబలి` మ్యాజిక్ని రీ క్రియేట్ చేయబోతున్నట్టు అర్థమవుతోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 8న ప్రపంచ వ్యాప్తంగా 10 ప్రధాన భారతీయ భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఈ మోషన్ పోస్టర్ చూసి మెగా, నందమూని ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు.