కరోనా సినీ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. సినిమా రిలీజ్ లు ప్రమోషన్ కార్యక్రమాలతో పాటు షూటింగ్ లు కూడా నిలిచిపోవటంతో సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి సాయం చేసేందుకు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. షూటింగ్స్ నిలిచిపోవడంతో రోజువారీ వేతనంతో బతికే పేద కళాకారులు, టెక్నీషియన్స్ ఇబ్బందులు పడుతున్నారు. రోజువారి కూలీతోనే బతికే వారికి సాయం చేసేందుకు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. అలాంటివారికి సాయం చేసేందుకు డైరెక్టర్ వి.వి. వినాయక్ ముందుకు వచ్చారు.
సీనియర్ నటుడు కాదంబరి కిరణ్కుమార్ ఆధ్వర్యంలో నడుస్తోన్న 'మనం సైతం' ఫౌండేషన్కు రూ. 5 లక్షలు అందజేశారు. నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్న పేద సినీ కళాకారులు, సాంకేతిక విభాగాల్లో పనిచేసే కార్మికులు మనం సైతంను సంప్రదించి, వాటిని పొందవచ్చని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ఒక వీడియో సందేశం ద్వారా వినాయక్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ, `ఈరోజు అందర్నీ వణికిస్తోన్న కరోనా వైరస్ను మన ఇళ్లల్లో మనం ఉండి వణికించాలి.
ఫిల్మ్ ఇండస్ట్రీలోని పేద కళాకారులు, టెక్నీషియన్లు, డాన్సర్లు, ఫైటర్లు.. ఎవరైనా కానివ్వండి.. నెల రోజుల పాటు షూటింగ్స్ లేక చాలా ఇబ్బందులు పడుతుంటారు. వాళ్లకు నిత్యావసర వస్తువులను అందజేసే నిమిత్తం నా వంతుగా రూ. 5 లక్షల చెక్కును మనం సైతం కాదంబరి కిరణ్కుమార్కు అందజేస్తున్నా. నిజంగా ఎవరికి అవసరమో వారు కాదంబరి కిరణ్ గారిని సంప్రదించి, నిత్యావసర వస్తువులను తీసుకోవాల్సిందిగా కోరుతున్నా" అని చెప్పారు. నిరంతరం పేద సినీ కళాకారుల సంక్షేమం కోసం పరితపిస్తోన్న 'మనం సైతం' ఫౌండేషన్ను ఈ సందర్భంగా వినాయక్ ప్రశంసించారు. అందుకే ఆ ఫౌండేషన్ ద్వారా తన వంతుగా ఈ చిన్న సాయాన్ని చేస్తున్నానని ఆయన చెప్పారు.