ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నిటినీ గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనాపై అన్ని దేశాలు కూడా గట్టిగా యుద్ధాన్ని ప్రకటించాయి. ముందుగా ప్రజలను తమ ఇళ్లకు పరిమితం చేసేలా లాకౌట్ ప్రకటించిన పలు దేశాలు, ఎవ్వరూ కూడా అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని, అలానే ఎవరికి వారు తప్పనిసరిగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తేనే త్వరితగతిన ఈ వ్యాధిని అరికట్టగలం అని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో 21 రోజులు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలో కరోనా బారినపడ్డ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ పోతుంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు 500 దాటిపోయాయి. కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 10కి చేరింది.  అయితే దీని వలన ప్రజలందరూ ఎటువంటి పనులు లేక ఇంటికే పూర్తిగా పరిమితం కావాల్సి వచ్చింది, దానితో ఇల్లు గడిచే పరిస్థితి లేక పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల వారు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు.

 

అయితే వారిని ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్యాకేజీలను ప్రకటించడం జరిగింది. ఎలాంటి విపత్తు వచ్చినా చిత్ర పరిశ్రమ సాయానికి ఎప్పుడూ ముందుంటుంది. హీరోలు దర్శక నిర్మాతలు తమ వంతుగా సాయం చేసి ఆదుకునేందుకు తమ వంతు సాయం చేస్తున్నారు. కరోనా వైరస్ బాధితుల సహాయార్థం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరుగా భారీ విరాళాలు అందిస్తున్నారు. కరోనాపై పోరాటానికి నాంది పలికిన తెలుగు సినిమా హీరో నితిన్ తో మొదలైన ఆర్థిక సాయం ఇప్పుడు ఊపందుకుంది.

 

మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, మంచు మనోజ్, రాజశేఖర్, అల్లరి నరేష్, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, వి.వి.వినాయక్, అనిల్ రావిపూడి వంటి వారు ముందుకు వచ్చి తమ వంతుగా విరాళాలు అందించడం జరిగింది. ఇప్పుడు తాజాగా సామాజిక కార్యక్రమాలపై స్పందించడానికి ఎప్పుడూ ముందుండే జూనియర్ ఎన్టీఆర్ కూడా భారీగానే విరాళం అందించాడు. తెలుగు రాష్ట్రాలలో కరోనాపై యుద్ధానికి తన వంతు బాధ్యతగా 75 లక్షల రూపాయలు విరాళం అందించాడు. రాబోయే రోజుల్లో ఇంకా ఎంత మంది సెలెబ్రెటీలు ముందుకు వస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: