టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు. అంతేకూండా తన పుట్టిన రోజు వేడుకలను కూడా రద్దు చేసుకున్నాడు. కరోనా వ్యాప్తి కారణంగా దేశంలో నెలకొన్న భయానక పరిస్థితుల నేపథ్యంలో హీరో నితిన్ పెళ్లి వాయిదా వేసుకుంటున్నట్లు నితిన్ ప్రకటించాడు. ఆరేళ్లుగా తను ప్రేమిస్తోన్న షాలిని అనే యువతిని ఏప్రిల్ 16న పెళ్లాడటానికి నితిన్ రెడీ అయిన సంగతి తెలిసిందే. ఇదివరకే ఆ ఇద్దరి కుటుంబాలూ పసుపు కుంకుమ వేడుకను నిర్వహించాయి కూడా. నిజానికి దుబాయ్లో డెస్టినేషన్ మ్యారేజ్ చేయడానికి పెద్దలు నిర్ణయించారు. 15న నిశ్చితార్థం, వందమంది సన్నిహితుల సమక్షంలో ఏప్రిల్ 16న వివాహ వేడుక జరుపడానికి దుబాయ్లోని ఒక హోటల్ను కూడా బుక్ చేసుకున్నారు.
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో డెస్టినేషన్ వెడ్డింగ్ ఆలోచనను మానుకొని, హైదరాబాద్లో నిర్ణయించిన ముహూర్తానికే వివాహం జరపాలని వధూవరుల కుటుంబాలు భావించాయి. కానీ కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటం, వేడుకలకు దూరంగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరికలు చేస్తుండటంతో పెళ్లిని వాయిదా వేసుకోవడమే మంచిదని భావించిన నితిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించాడు.
అంతేకాకుండా మార్చి 30న తన పుట్టినరోజున ఎలాంటి వేడుకలు జరుపుకోకూడదని, అభిమానులు ఇందుకు సహకరించాలని కోరాడు. ఈ సందర్భంగా మనందరం కలసి కట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని, ఈ సంక్షోభ సమయంలో మనందరం ఇళ్లలో కాలు మీద కాలేసుకుని, మన కుటుంబంతో గడుపుతూ బయటకి రాకుండా ఉండటమే దేశానికి సేవ చేసినట్లు అని ప్రకటించాడు. కరోనా కేసులు తగ్గి, సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత తదుపరి పెళ్లి డేట్ నిర్ణయించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన 'భీష్మ' సినిమాతో మంచి ఊపు మీదున్న నితిన్ ప్రస్తుతం వెంకీ అట్లూరి డైరెక్షన్ లో 'రంగ్ దే' చిత్రంలో నటిస్తున్నాడు.