ప్రదీప్ మాచిరాజు రెండు తెలుగు రాష్ట్రాల్లో టాప్ యాంకర్ గా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు. యాంకర్ గానే కాదు అప్పుడప్పుడు సినిమాలలో ను చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ అలరిస్తున్నాడు కూడా. ఇక త్వరలో '30 రోజులలో ప్రేమించడం ఎలా' అన్న సినిమాతోను హీరోగా మారి మన ముందుకు రాబోతున్నాడు. ఇక లాక్డౌన్ కారణంగా సినిమా, టీవీ షూటింగ్లన్నీ అర్ధాంతరంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ కార్మికులను ఆదుకునేందుకు కొంతమంది హీరోలు, దర్శక, నిర్మాతలు ముందుకొచ్చి రూ.కోట్లల్లో విరాళాలు ప్రకటిస్తున్నారు. అయితే సినిమా వాళ్ళలో ఈ విరాళాని ప్రకటించింది మాత్రం ముందుగా యంగ్ హీరో నితిన్.
ఇక బుల్లితెరపై కూడా చాలా మంది కార్మికులు ఆధారపడి ఉంటారు. వారిని ఆదుకునేందుకు ఇంత వరకూ ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. ఈ పరిస్థితుల్లో మీకు అండగా నేనున్నానంటూ యాంకర్ ప్రదీప్ ముందుకు రావడం చాలా గొప్ప విషయం. బుల్లితెరకు సంబంధించి ఒక్కో షోకు వందలాది కార్మికులు కష్టపడుతుంటారు. వీరిలో కొందరినైనా తన శక్తి మేరకు ఆదుకునేందుకు ప్రదీప్ ముందుకొచ్చాడు. 60 మంది బుల్లితెర కార్మికులకు .. ఒక నెలకు సరిపడా ఆర్థికసాయం చేస్తాననని ప్రదీప్ ప్రకటించాడు.
కరోనా వైరస్ను తరిమి కొట్టే క్రమంలో లాక్డౌన్ చేపట్టడంతో చాలా రోజుల నుంచి షూటింగ్లు జరగట్లేదు. ఇంకా ఎన్ని రోజులు జరగకుండా ఉంటాయో తెలీదు. ఈ పరిస్థితిలో వాళ్లకు ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంటుంది. రోజువారీ వేతనానికి పనిచేసే బుల్లితెర కార్మికులకు సంబంధించి నాకు తెలిసిన 60 కుటుంబాలు ఉన్నాయి. వాళ్లందరికీ ఒక నెలకు సరిపడే ఆర్థిక సహాయాన్ని నేను చేద్దామని అనుకుంటున్నాను. నా తరఫున ఇది ఒక చిన్న ప్రయత్నం మాత్రమే... అని ప్రదీప్ తెలిపాడు.
యాంకర్ ప్రదీప్ను ఆదర్శంగా తీసుకుని బుల్లితెర సెలబ్రిటీలు ముందుకొస్తారని, ఆ రంగంలోని కార్మికుల కనీస అవసరాలను తీర్చే ప్రయత్నం చేస్తారని ఇప్పుడు కొందరు ఆశిస్తున్నారు. అయితే వెండితెరమీద ముందుగా స్పందించిన నితిన్ కి అలాగే బుల్లితెర కార్మీకుల కొసం సహాయం చేయడానికి ముందుగా ముందుకు వచ్చిన ప్రదీప్ లను అందరు అభినందిస్తున్నారు.