యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మేజర్ పార్ట్ పూర్తయ్యింది. కానీ కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్ లు క్యాన్సిల్ కావటంతో ఎన్టీఆర్ తో పాటు ఆర్.ఆర్.ఆర్ టీం అంతా ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఆర్.ఆర్.ఆర్ సెట్స్ మీద ఉండగానే నెక్ట్స్ సినిమాను లైన్ లో పెట్టే ఆలోచనలో ఉన్నాడు తారక్.
ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నెక్ట్స్ సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించాడు ఎన్టీఆర్. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సూపర్ హిట్ కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా ఎన్టీఆర్ ను మరో డిఫరెంట్ యాంగిల్ లో చూపించేందుకు రెడీ అవుతున్నాడు త్రివిక్రమ్. ఈ సినిమాకు అయిననూ పోయి రావలే హస్తినకు అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను పరిశీలిస్తున్నారట.
టైటిల్ ను బట్టి చూస్తే ఈ సినిమా పొలిటికల్ సెటైర్ అయి ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్కు జోడిగా ఓ బాలీవుడ్ ముద్దుగుమ్మను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ పై చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో విజయ్ దేవరకొండ సినిమాతో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందన్న ప్రచారం జరిగినా ఆ ప్రాజెక్ట్ వర్క్ అవుట్ కాలేదు.
తాజాగా జాన్వీ, ఎన్టీఆర్ సినిమాతో ఎంట్రీ ఇస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. సీనియర్ ఎన్టీఆర్, శ్రీ దేవీ కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్తో ఆ అందాల భామ కూతురు నటిస్తుండటంపై అభిమానులు ఆనందంగా ఉన్నారు.