కరోనా నేపథ్యంలో మన టాలీవుడ్ హీరోలు సినిమాలలోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోలు అనిపించుకుంటున్నారు. ఏదైనా విపత్తు వస్తే స్పందించడానికి టాలీవుడ్ ఎప్పుడూ ముందే ఉంటుంది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచం మొత్తం వ్యాపించింది. ఈ వైరస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా తన పంజాను చూపెడుతోంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వాలు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. అలాగే ఈ వైరస్ సోకకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ సర్కార్ హీరో విజయ్ దేవరకొండతో ఇప్పటికే ఒక వీడియో ప్రకటనను విడుదల చేసింది. తర్వాత మిగిలిన హీరోలు సైతం తమ వంతు సామాజిక బాధ్యత గా సోషల్ మీడియా ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాని, రామ్ మొదలైన స్టార్ హీరోలతో పాటు మంచు మనోజ్, విశ్వక్ సేన్, నిఖిల్, శివ బాలాజీ, ఆలీ వంటి వారు కూడా కరోనా వైరస్ సోకకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వీడియోల రూపంలో ప్రజలకు సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన సూత్రాలను పాటిస్తే కరోనా వైరస్ నుంచి సులువుగా బయటపడోచ్చని ఈ వీడియోల ద్వారా తెలిపారు. అలాగే కోవిడ్ 19 వైరస్ పై వాట్సాప్ లో వచ్చే ప్రతి వార్తను నమ్మొద్దని, ఆ వార్తల్లో నిజమెంతో తెలియకుండా ఫార్వాడ్ చేయొద్దని కూడా చెప్పారు. ప్రజలు అనవసరంగా భయాందోళనకు లోనుకాకుండా ప్రభుత్వం ఇచ్చే సలహాలు, సూచనలు పాటించి మనల్ని మనమే కాపాడుకోవాలని సూచించారు.
తాజాగా చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ లు కరోనా జాగ్రత్తలు తెలియజేస్తూ ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారు. సామాజిక దూరం పాటించాలని, ఇంట్లోనే ఉంటూ సురక్షితంగా ఉండాలని ఈ వీడియోల ద్వారా తెలియజేస్తూనే ఉన్నారు. ఇలా టాలీవుడ్ లోని స్టార్ హీరోల దగ్గరి నుండి చిన్న హీరోల వరకు తమ సామాజిక బాధ్యతగా వీడియోలను పోస్ట్ చేయడంతో ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. తమ హీరోలు కూడా తమ వంతు బాధ్యతగా కరోనా వైరస్ నిరోధానికి కృషి చేస్తున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడితో ఆగకుండా టాలీవుడ్ లో హీరోలందరూ తమకు తోచిన విధంగా కరోనా బాధితుల కోసం సహాయం చేస్తున్నారు. దేశానికి ఏదైనా విపత్తు వస్తే తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుందని, సహాయం చేయడంలో 'టాలీవుడ్ హీరోలందరూ ది బెస్ట్' అని మరోసారి నిరూపించారు.