ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరిన్ని దేశాలకు వ్యాప్తి చెందింది. ఇప్పటివరకు ఈ మహమ్మారి 200 దేశాలకు పాకింది. ఇక కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7.60 లక్షలకు చేరింది. కరోనా వైరస్ దెబ్బకు ప్రజలు అబ్బా అంటున్నారు. సెలబ్రిటీలు సైతం ఈ వైరస్ బారి నుండి తప్పించుకోలేకపోతున్నారు. ప్రధానంగా విదేశాల నుండి స్వదేశాలకు తిరిగివస్తున్న సెలబ్రిటీలపై అందరి దృష్టి ఉంది. ఇక కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలతో పాటు సెలబ్రిటీలంతా ఇంట్లోనే గడుపుతూ కుటుంబంతో కలిసి ఖాళీ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజులుగా అజయ్ దేవగన్ కుటుంబానికి సైతం కరోనా సోకినట్టు వార్తలు గుప్పుమన్నాయి. అజయ్ దేవగన్, కాజోల్ కుమార్తె నిషా సింగపూర్లో చదువుకుంటోంది. కరోనా ప్రభావం కారణంగా ఆమెను కాజోల్ స్వయంగా సింగపూర్ వెళ్ళి ముంబై తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న తరుణంలో నిషా ప్రాణాంతక వైరస్ బారిన పడ్డారని.. కాజోల్కు కూడా ప్రమాదం పొంచి ఉందంటూ వదంతులు వ్యాపించాయి. అయితే తాజాగా అజయ్ దేవ్గణ్ దీనిపై స్పందించారు.
కాజోల్, నిషా ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని, వారికి కరోనా సోకినట్టు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని ధృవీకరించారు. ఇకపోతే కాజోల్, నిషా ఇద్దరూ వైద్యుల సలహా మేరకు కొన్ని రోజులుగా సెల్ఫ్ ఐసోలేషన్లోనే ఉన్నారు. కాగా, హల్చల్, గూండారాజ్, ఇష్క్, దిల్ క్యా కరే, రాజూ చాచా, ప్యార్ తో హోనా హై థా వంటి సినిమాల్లో కలిసి నటించిన కాజోల్- అజయ్.. 1999లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు. ఇక ప్రస్తుతం అజయ్ దేవ్గణ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.