తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నటుడు విశ్వక్‌ సేన్‌. ఈ సినిమా తరువాత తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఫలక్‌ నుమా దాస్ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు ఈ యంగ్ హీరో. మలయాళ సూపర్‌ హిట్‌ అంగమలై డైరీస్‌ కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు కూడా విజయం సాధించింది. తాజాగా నాని నిర్మించిన హిట్ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు విశ్వక్ సేన్‌.

 

విక్రమ్ రుద్రరాజు పాత్రలో విశ్వక్ నటనకు సైలేష్ కొలను నేరేషన్‌, వి మణికందన్‌ సినిమాటోగ్రఫి, వివేక్ సాగర్ సంగీతం కలిసి ఈ సినిమాను విజయ తీరాలు చేర్చాయి. ఈ సినిమా సక్సెస్‌ సందర్భంగా ఓ యూట్యూబ్ చానల్‌ తో మాట్లాడిన విశ్వక్‌ సేన్‌ భవిష్యత్తులోనూ డైరెక్టర్‌గా కొనసాగే ఆలోచనలో ఉన్నాడు. ప్రస్తుతం హీరోగా కొనసాగుతూనే కొన్ని స్క్రీప్ట్స్ మీద కూడా వర్క్ చేస్తున్నాడట విశ్వక్. అంతేకాదు హిందీలోనూ సినిమాను రూపొందించే ఆలోచనలో ఉన్నాడు.

 

ఈ సందర్భంగా విశ్వక్‌ మాట్లాడుతూ.. తనకు మహేష్ బాబును డైరెక్ట్ చేయాలనుందని వెల్లడించాడు. `నేను చిన్నతనం నుంచి మహేష్ బాబు సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనకు నేను చాలా పెద్ద అభిమానిని. కొంచెం పెద్ద అయ్యాక ఎన్టీఆర్ అంటే కూడా అభిమానం ఏర్పడింది. తప్పకుండా ఏదో ఒక రోజు మహేష్ బాబును డైరెక్ట్ చేస్తా`నని చెప్పాడు. హిట్ సినిమా తరువాత కొత్త దర్శకుడు నరేష్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

 

పాగల్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాలో బెంగళూరు బ్యూటీ క్రితి శెట్టి హీరోయిన్‌గా నటించనుందన్న టాక్‌ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: