అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం 'లవ్ స్టోరీ'. ఈ చిత్రానికి సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తుండగా సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. కాగా నారాయణదాస్ నారంగ్, ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సున్నితమైన ప్రేమ కథా చిత్రాలని తనదైన స్టైల్ లో తెరకెక్కించే శేఖర్ కమ్ముల, 'మజిలీ', 'వెంకీమామ' వంటి వరుస విజయాలతో దూకుడు మీదున్న నాగచైతన్యతో కలిసి మరో లవ్ స్టోరీని మన ముందుకు తీసుకొస్తున్నాడు. 'ఫిదా' లాంటి సెన్సేషనల్ హిట్ సినిమా తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకుని శేఖర్ కమ్ముల తీస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.

 

ప్రేక్షకులు సైతం ఈ ప్రాజెక్ట్ తప్పకుండా చైతూ కెరీర్లో వసూళ్ళ పరంగా కొత్త ఫిగర్స్ నమోదుచేయవచ్చని అనుకుంటున్నారు. విడుదల తర్వాతి సంగతి ఎలా ఉన్నా విడుదలకు ముందే ఈ చిత్రం చైతూకు ఒక రికార్డ్ అందించింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అండ్ ఓవర్సీస్ హక్కులు చైతూ గత సినిమాలన్నింటికంటే భారీ ధర పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కారణం సినిమా కాంబినేషన్. శేఖర్ కమ్ముల గత చిత్రం ‘ఫిదా’ భారీ బ్లాక్ బస్టర్ అయింది. ముఖ్యంగా ఓవర్సీస్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. దానికి తోడు సాయి పల్లవి ఇందులో హీరోయిన్. చైతూతో కలిసి ఆమె నటించడం ఇదే ఫస్ట్ టైం, అందుకే వీరి జోడీపై అంచనాలు పెరిగాయి. అక్కినేని నట వారసుడిగా కెరీర్ ప్రారంభించిన నాగ చైతన్య కొత్త తరహా స్టోరీలను సెలెక్ట్ చేసుకుంటూ తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి నాగ చైతన్య ఈ సినిమాతో వరుస విజయాలతో హ్యాట్రిక్ నమోదు చేస్తాడో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: