తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లు చాలా అరుదు. ఇప్పుడున్న స్టార్ హీరోయిన్ నుండి చిన్న చిన్న సినిమాల్లో నటించే హీరోయిన్ల వరకు అందరూ వేరే రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళే. అయితే వీరంతా తెలుగు సినిమాని ఎంతగా ప్రేమిస్తారంటే చెప్పడం కష్టమే. బాలీవుడ్ లో అవకాశం వచ్చేవరకు ఇక్కడ సినిమాలు చేసి అక్కడ అవకాశం రాగానే అన్నీ సర్దుకుని చెక్కేస్తుంటారు. మళ్ళీ తెలుగులో నటించడానికి కూడా ఇష్టపడరు.

 

తాజాగా అర్జున్ రెడ్డి భామ షాలినీ పాండే కూడా అంతే.. అర్జున్ రెడ్డి సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న షాలినీకి తెలుగులో అవకాశాలు వచ్చి పడలేదు. అర్జున్ రెడ్డిలో నటనపరంగా విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. కానీ అవకాశాలు అంతగా రాలేదు. అర్జున్ రెడ్డి మినహా ఆమె నటించిన మిగతా చిత్రాలేవీ బాక్సాఫీసు వద్ద అంత సక్సెస్ అవ్వలేదు. మొన్నటికి మొన్న ఇంటెన్స్ లవ్ స్టోరీతో వచ్చిన ఇద్దరిలోకం ఒకటే కూడా డిజాస్టర్ గా మిగిలింది.

 

అయితే ప్రస్తుతం ఈ అమ్మడుకి బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సరసన నటించే అవకాశం దక్కింది. అర్జున్ రెడ్డిలో ఆమె నటనని చూసిన రణ్ వీర్ ‘జయేష్ బాయ్ జోర్దార్’ సినిమాలో అవకాశం ఇచ్చాడు. దీంతో ఈ అమ్మడు ఆనందానికి పట్టపగ్గాల్లేకుండా అయిపోయాయి. ఇదే కాదు బాలీవుడ్ లో ఒక వెబ్ సిరీస్ లో సైతం ఆమెకి అవకాశం వచ్చింది.

 

ఆదిత్య రావల్ హీరోగా నటిస్తున్న ‘బమ్ ఫాడ్’ అనే వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా షాలినీకి అవకాశం దక్కింది. దీంతో ఆమె టాలీవుడ్ కి టాటా చెప్పెసినట్టే అని అంటున్నారు. ఒక్క టాలీవుడ్ కే కాదు దక్షిణాది చిత్రాలకి సైతం ఆమె ఫుల్ స్టాప్ పెట్టేసిందట. దక్షిణాదిన గ్లామర్ ఒలకబోసే హీరోయిన్లకి ఎక్కువ అవకాశాలు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. గ్లామర్ పాళ్ళు తక్కువగా ఉన్న షాలినీకి మళ్ళీ ఇక్కడ అవకాశాలు అంతగా రావనే చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: