సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ నటిస్తున్నన్న తాజా చిత్రం 'సీటీమార్'. గత కొంతకాలంగా వరుస ఫ్లాపుల్లో ఉన్న గోపీచంద్ ఈ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇక ఈ చిత్రంలో గోపీచంద్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుంది. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా సీటి మార్. ఇప్పటికే ఈ సినిమా లో తమన్నా లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతేకాదు దిగంగన సూర్యవంశీ కూడా ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఇంతకముందు 'గౌతమ్ నందా' సినిమాలో గోపీచంద్ను హీరోగా, విలన్గా నటింపజేశాడు సంపత్ నంది. అయితే ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. అందుకే ఈసారి ఎలాగైనా గోపీచంద్ కి హిట్టివ్వాలన్న కసితో ఉన్నాడు. అంతేకాదు ఈ సినిమా సక్సస్ సంపత్ నందికి చాలా కీలకం.
'గౌతమ్ నందా', 'ఆక్సిజన్', 'చాణక్య' .. మాస్ కథలతో తెరకెక్కిన సినిమాలన్ని గోపీచంద్ కి నిరాశనే మిగిల్చాయి. ఇక సీనియర్ డైరెక్టర్ బి. గోపాల్ దర్శకత్వం లో తెరకెక్కిన 'ఆరడుగుల బుల్లెట్' సినిమా అయితే లాబ్ లోనే ఉండిపోయింది. ఈ సినిమా తర్వాత 25వ సినిమాగా నటించిన 'పంతం' కూడా ఫ్లాప్ గా నే మిగిలింది. అందుకే గోపీచంద్ తన సినిమాలకి భారీ బడ్జెట్ పెట్టొద్దని నిర్మాతలకి ముందే చెప్పాడు. అసలే మార్కెట్ లేదు. పొరపాటున సినిమా రిజల్ట్ గనక తేడా వస్తే నిర్మాతకి భారీగా నష్టాలు వస్తాయనే గోపీచంద్ ఇలా నిర్మాతలకి చెప్పాడు.
ఇక తాజాగా 'సీటీమార్' సినిమా చేస్తున్నాడు. సంపత్ నంది కి ఈ సినిమా తప్ప మరో సినిమా చేతిలో లేదు. ఈ సినిమా హిట్ అయితేనే సంపత్ నంది టాలీవుడ్ లో కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే టాప్ హీరోలందరు సంపత్ నందిని పక్కన పెట్టేశారు. పదేళ్ల కెరీర్ లో సంపత్ నంది తీసింది నాలుగు సినిమాలు మాత్రమే. 'సీటీమార్' సినిమా ఇప్పుడు సంపత్ నంది కెరీర్ కి చాలా కీలకంగా మారింది. మరి ఈ ఇద్దరికి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుందో చూడాలి.