కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో తెలుగు సినిమా హీరోలు పేదవారికి అండగా నిలుస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఇప్పటికే అన్ని సినిమాల షూటింగ్లు బంద్ అయ్యాయి. మరోవైపు సినిమా రిలీజ్లు ఆగిపోవడంతో సినీ కార్మికులు ఉపాధి లేక రోడ్లమీదకు వచ్చేస్తున్నారు. మరి కొంత మంది రోజువారి జీవనం గడవక విలవిల్లాడుతున్నారు. ఈ సినీ కార్మికులను ఆదుకునేందుకు ఎంతో మంది సినిమా సెలబ్రిటీలు ముందుకు వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ఆథ్వర్యంలో ఇప్పటికే ఏర్పాటు అయిన కరోనా క్రైసిస్ ఛారిటీకి భారీగా విరాళాలు అందజేశారు.
ఈ ఛారిటీ ద్వారా ఇప్పటికే రూ.7 కోట్లకు పైగా సేకరించారు. ఈ డబ్బుతో సినీ పరిశ్రమలోని రోజువారీ వేతనానికి పనిచేసే కార్మికుల కుటుంబాలకు నిత్యావసరాలు అందజేస్తున్నారు. స్టార్ హీరోలు అందరూ ముందుకు వచ్చి భారీగా విరాళాలు ఇవ్వడంతో ఏకంగా రు. 7 కోట్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే గోపీచంద్ కూడా సీసీసీకి విరాళం అందజేశారు. అలాగే విరాళంతో పాటు హైదరాబాద్లోని 1000 పేద కుటుంబాలకు నెల రోజులకు సరిపడే నిత్యావసర సరుకులను అందజేశారు.
గోపీచంద్ స్వయంగా నిత్యావసరాలు అందజేస్తోన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన వాళ్లు అంతా ఇప్పుడు గోపీచంద్ రియల్ హీరో అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అలాగే నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి కూడా తన పెద్ద మనసు చాటుకున్నారు. ఆయన కూడా 50 కుటుంబాలకు నెల రోజులకు సరిపడా నిత్యావసరాలు అందజేశారు.
ఇక గోపీచంద్ ప్రస్తుతం సిటీమార్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కే ఈ సినిమాకు సంపత్ నంది దర్శకుడు. గోపీచంద్ కబడ్డీ ప్లేయర్గా కనిపించనున్నారు. అలాగే, మహిళా కబడ్డీ జట్టుకు కోచ్గా తమన్నా నటిస్తోంది.