ముక్కు సూటిగా మాట్లాడే మోహన్ బాబు ఏదైనా మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తే ఆ ఇంటర్వ్యూలో ఎదో ఒక సంచలన విషయం ఉంటుంది. ప్రస్తుతం కరోనాతో ప్రజలు అంతా అల్లాడిపోతున్న సమయంలో నిన్న ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోహన్ బాబు కరోనా సమస్య వల్ల ప్రస్తుతం సమాజం ఎదుర్కుంటున్న సమస్యల పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు.


కరోనా ప్రభావంతో రేపు ఏమి జరుగుతుందో తెలియక ఎవరు ఆనందంగా ఉండలేక పోవడమే కాకుండా కనీసం తినే తిండి పై కూడ శ్రద్ధ పెట్టలేకపోతున్నారని కామెంట్స్ చేసాడు. అంతేకాదు తనకు ఎంతో ఇష్టమైన తన కూతురు మనవలను కూడ కరోనా దూరంగా ఉంచింది అంటూ కరోనా భయం వల్ల తన ఇంటిలో ఉన్న తన కూతురు మంచు లక్ష్మిని అదేవిధంగా తన మనవరాలుని తనకు తానుగా బాధతో వేరే ఇంటికి పంపించి వేసిన విషయాన్ని ఎంతో బాధతో గుర్తుకు చేసుకున్నాడు.


జీవితంలో ఏది శాస్వితం కాదు అన్న విషయం అందరికీ తెలిసినదే అయినా కరోనా అందరికీ మరొకసారి గుర్తుకు చేస్తోంది అని చెపుతూ ఈ వ్యాధి తగ్గిన తరువాత ఏర్పడే కొత్త సమాజంలో చాల మార్పులు వస్తాయి అన్న జోశ్యం మోహన్ బాబు చెపుతున్నాడు. ఇదేసందర్భంలో మోహన్ బాబు చేత రాజకీయాలు మాట్లాడించాలని ఆ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్న న్యూస్ ప్రెజంటర్ మోహన్ బాబును ఒక ఇరుకున పెట్టే ప్రశ్నను అడిగి సమాధానం రాబట్టడానికి ప్రయత్నించాడు.


‘లోటస్ పాండ్ తో చుట్టరికం లోటస్ తో పెరిగిపోతున్న సాన్నిహిత్యం మధ్య రానున్న రోజులలో మోహన్ బాబు అడుగులు ఎటువైపు’ అంటూ అడిగిన ప్రశ్నకు మోహన్ బాబు చాల గుంభనంగా సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల మధ్య జనం అల్లాడిపోతుంటే తనతో రాజకీయాలు మాట్లాడించ వద్దని అయితే తన మనసులో ఒక నిర్ణయం ఉందని ఆ విషయాన్ని తరువాత చెపుతాను అంటూ తెలివిగా తప్పించుకున్నాడు. దీనితో మోహన్ బాబు కామెంట్స్ తో రాజకీయం చేద్దామని ప్రయత్నించిన ఆ న్యూస్ ప్రెజెంటర్  ప్రయత్నాలు ఫలించలేదు..

మరింత సమాచారం తెలుసుకోండి: