అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'అల వైకుంఠపురములో' చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి జనవరి 12న విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ సినిమా బ్లాక్‌బస్టర్ మ్యూజికల్ హిట్‌గా కూడా నిలిచింది. సినిమా విడుదలకు ముందే  పాటలన్నీ ప్రజలను అలరించాయి. నిజానికి ‘అల వైకుంఠపురములో’ మ్యూజిక్ ఆల్బమ్ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేసింది. తమన్ స్వరపరిచిన ప్రతి పాట అద్భుతమే అని చెప్పాలి. ముఖ్యంగా ‘సామజవరగమన’, ‘బుట్టబొమ్మ’, ‘రాములో రాములా’ పాటలు ఎంత హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ పాటలు మన తెలుగులోనే కాకుండా ఇతర ఇండస్ట్రీల్లో కూడా ఒక ఊపు ఊపాయి. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆల్బమ్ 1 బిలియన్ అంటే వంద కోట్ల పైచిలుకు వ్యూస్ సాధించింది. 

 

'అల వైకుంఠపురములో' సినిమాకు ఇంత మంచి ఆల్బమ్ ఇచ్చిన తమన్‌‌ను బన్నీ తాజాగా ప్రశంసించారు. దానికి కారణం ‘అల వైకుంఠపురములో’ మ్యూజిక్ ఆల్బమ్‌ను ఇప్పటి వరకు 100 కోట్లకు పైగా శ్రోతలు విన్నారు. నిజానికి 100 కోట్ల ప్లే ఔట్స్ వచ్చే ఆల్బమ్‌ను ఇస్తానని బన్నీకి తమన్ మాటిచ్చారట. అందుకే ఆ విషయాన్ని గుర్తు చేస్తూ బన్నీ ట్వీట్ చేశారు. ‘‘ప్రియమైన తమన్. నాకు చాలా గర్వంగా ఉంది. ఇచ్చిన మాట కోసం నువ్వు చాలా కష్టపడతామని అర్థమైంది. ‘అల వైకుంఠపురములో’ ప్రారంభంకావడానికి ముందు ఒక బిలియన్‌కు పైగా ప్లే ఔట్స్‌ వచ్చే ఆల్బమ్‌ కావాలి అని నేను అడిగాను. ‘తప్పకుండా ఇస్తాను బ్రదర్ ప్రామిస్’ అని నువ్వు చెప్పావు. ఈరోజు ఆ ఆల్బమ్ 1.13 బిలియన్‌ దాటేసింది. థాంక్యూ’’ అని అల్లు అర్జున్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘మాట మీద నిలబడే మనిషి’ అని తమన్‌కు బిరుదు కూడా ఇచ్చారు బన్నీ. ఈ ట్వీట్‌కు స్పందించిన తమన్.. 'ఈ ట్వీట్‌ను నా జీవితాంతం గుర్తుంచుకుంటాను బ్రదర్' అని రిప్లై ఇచ్చాడు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: