రాఘవ లారెన్స్ మరోసారి తన సహృదయాన్ని చాటుకున్నాడు. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే అండగా ఉండే లారెన్స్.. కరోనా నివారణ చర్యల కోసం మూడు కోట్లు విరాళం ప్రకటించారు. అలాగే కొత్త సినిమాను ఎనౌన్స్ చేస్తూ.. ఇచ్చిన అడ్వాన్స్ లోంచి 3కోట్లు విరాళంగా ఇస్తున్నట్టు ట్వీట్ చేశాడు లారెన్స్. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సీక్వెల్ చేస్తున్నాడు లారెన్స్. 

 

డ్యాన్స్ మాస్టర్ గా.. యాక్టర్ గా.. డైరెక్టర్ గా మెప్పించిన  లారెన్స్ కష్టాల్లో ఆదుకుంటాడన్న పేరుంది. ట్విట్టర్ వేదికగా.. తర్వాతి ప్రాజెక్ట్ పై ఆసక్తికరమైన విషయంతో పాటు.. కరోనా బాధితులకు తన వంతుగా 3కోట్ల భారీ విరాళం ఇవ్వనున్నట్టు తెలిపాడు. 15ఏళ్ల క్రితం సూపర్ స్టార్ కు బ్లాక్ బస్టర్ ఇచ్చిన సినిమా చంద్రముఖి సీక్వెల్లో లారెన్స్ నటించడం విశేషం. 

 

లారెన్స్ తన అభిమాన నటుడు రజినీకాంత్ చిత్రం చంద్రముఖి సీక్వెల్లో నటిస్తున్నాడు. రజినీకాంత్ అనుమతితో.. దర్శకుడు పి.వాసు దర్శకత్వంలో సన్ పిక్చర్ అధినేత కళానిధి మారన్ ఆశీస్సులతో దక్కిన ఈ అవకాశాన్ని తన అధృష్టంగా భావిస్తున్నానన్నారు లారెన్స్. ఈ చిత్రం ద్వారా వచ్చిన అడ్వాన్స్ లో రూ.3కోట్లు కరోనా వైరస్ రిలీఫ్ ఫండ్ కు విరాళంగా ఇచ్చినట్టు ట్వీట్ చేశాడు లారెన్స్. 

 

లారెన్స్ ఇచ్చిన 3కోట్ల విరాళాన్ని ఆరు రకాలుగా పంచారు. పీఎం-కేర్స్ ఫండ్ కు 50లక్షలు, తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ కు 50లక్షలు, సౌత్ ఇండియా కార్మికుల సంఘం ఫెప్సీకి రూ.50లక్షలు ఇచ్చారు. అలాగే డ్యాన్సర్స్ యూనియన్ కు 50లక్షలు, దివ్యాంగ పిల్లలకు రూ.25లక్షలు ఇవ్వనున్నారు. స్వస్థలం రోయపురంలో పోలీసుల సహాయంతో దినసరి కార్మికులకు, ప్రజల అవసరాలను తీర్చేందుకు 75లక్షలు ఇస్తున్నట్టు ప్రకటించాడు లారెన్స్. 

 

లారెన్స్ ప్రస్తుతం అక్షయ్ కుమార్, కియారా అద్వానీ జంటగా.. కాంచన హిందీ రీమేక్ లక్ష్మీ బాంబ్ ను డైరెక్ట్ చేస్తున్నారు. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: