కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ భయంతో ప్రజలంతా ఇళ్లే పరిమితమయ్యారు. అయితే డాక్టర్లు, శానిటేషన్ కార్మికులు, పోలీసులు మాత్రం ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు మరణాన్ని సైతం లెక్కచేయకుండా పోరాడుతున్నారు. అయితే ఇంతగా శ్రమిస్తున్న డాక్టర్లు, పోలీసులు మీద కూడా అడపాదడపా దాడులు జరుగుతున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాల కోసం కష్టపడుతున్నవారిపై దాడులు చేయటం దుర్మార్గం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగన్ కూడా ఈ సంఘటనలపై స్పందించాడు. `జుగుప్సగా, కోపంగా ఉంది. చదువుకున్న వారు కూడా డాక్టర్ల మీద దాడిచేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కేవలం అనుమానాలతో డాక్టర్లను ఇబ్బందులు పాలు చేయటం దారుణం. అలాంటి దుర్మార్గమైన మనుషులే నేరస్థులు` అంటూ ట్వీట్ చేశాడు అజయ్ దేవగన్.
ఈ సందర్భంగా ఆయన ప్రజలు ఇంట్లోనే ఉండాలని కోరాడు. కరోనా పై జరుగుతున్న ఈ పోరాటంలో భారత దేశం విజయం సాదిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశాడు అజయ్. ఇప్పటికే కరోనాపై పోరాటంలో భాగంగా 51 లక్షల రూపాయలు డొనేట్ చేశాడు. ఈ మొత్తాన్ని సినీ రంగంలో రోజువారి కూలీకి పనిచేస్తున్న కార్మికులకు నిత్యావసరాల కోసం వినియోగించాలని కోరాడు అజయ్ దేవగన్. కరోనా లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని రకాల షూటింగ్ లు ఆగిపోయాయి. దీంతో వేల కోట్ల రూపాయల నష్టం వాటిళ్లుతోంది.
DISGUSTED & ANGRY to read reports of “educated” persons attacking doctors in their neighbourhood on baseless assumptions. Such insensitive people are the worst criminals😡#StaySafeStayHome #IndiaFightsCorona
— ajay devgn (@ajaydevgn) April 12, 2020