కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఒక్కరూ ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మహమ్మారిలా మారి ప్రపంచాన్ని భయాందోళనలకి గురి చేస్తుంది. ఈ మహమ్మారి నుండి బయటపడాలని దేశమంతా లాక్డౌన్ నియమాన్ని పాటిస్తున్నా కూడా కరోనా బారిన పడ్డ వ్యాధిగ్రస్తులు రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నారు. అందువల్ల లాక్డౌన్ నియమాన్ని మరో 18 రోజులు పొడిగిస్తూ ప్రధానమంత్రి నిర్ణయం తీసుకున్నారు.
అయితే లాక్డ్పున్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింది. అన్ని రంగాల మీద ఈ ప్రభావం బాగా పడింది. సినిమా రంగం బాగా అవస్థలు పడుతోంది. థియేటత్లు మూతబడి, షూటింగులు ఆగిపోయి తీవ్ర సమస్యలని ఎదుర్కొంటున్నారు. అయితే లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా జనాలు థియేటర్లకి రావడం కష్టమే. జనాల్లొ ఉన్న భయం వల్ల వారు థియేటర్లకి రావాలంటే చాలా టైమ్ పడుతుంది.
అయితే జనాలు థియేటర్లకి రావడం రిలీజ్ అయ్యే సినిమా మీద ఆధారపడి ఉంటుంది. థియేటర్లకి వస్తే తమకి ఎలాంటి నష్టం వాటిల్లదన్న నమ్మకం థియేటర్ యాజమాన్యం కల్పించాలి. అలాగే సినిమా చూడాలన్న కోరిక జనాల్లో కలగాలి. అయితే ప్రస్తుతం అందరూ ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్న సినిమా పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ ఒక్కటే. రెండు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుండడంతో ఆయన అభిమానులు వకీల్ సాబ్ సినిమా కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
అదీ గాక ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది కూడా. అందువల్ల జనాలని థియేటర్లకి తీసుకువచ్చే సత్తా వకీల్ సాబ్ కి ఉంది. ఒక్కసారి సినిమా రిలీజై జనాలు థియేటర్లకి రావడం మొదలైతే సినిమాలు ఒక్కొక్కటిగా విడుదల అవుతుంటాయి. కాబట్టి జనాలు థియేటర్లకి రావాలంటే వకీల్ సాబ్ చిత్రం ముందుగా రిలీజ్ అయితే బాగుంటుందని అంటున్నారు.