తెలుగు సినీ సీమలో గాన గంధర్వుడు అంటే ఘంటసాల మాస్టార్ నే చెప్పుకోవాలి. ఆయన తన మూడున్నర దశాబ్దాల సిని సినీ జీవితంలో పది వేల పాటలు పాడారు. దివి నుంచి భువిని దిగివచ్చిన నాదస్వరూపం ఆయన అంటారు. తెలుగు లోగిళ్ళలను తన గాన మాధుర్యంతో తరింపచేయడానికి ఇలకు దిగి వచ్చిన అన్నమయ్య, త్యాగయ్య వంశీకుడు ఘంటశాల అని కూడా చెప్పాలి.
ఇక ఘంటసాల గాయకుడిగా మంచి దశలో ఉండగానే బాలు సినీ రంగ ప్రవేశం చేశాడు. ఇక అప్పటికే ఘంటసాల తన ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో పాటలు చాలా వరకూ తగ్గించుకున్నారు. ఆ సమయంలో యువ గాయకుడుకు బాలుకు అవకాశాలు ఎక్కువగా వచ్చాయి.
ఇదిలా ఉండగా 1970 దశకం మొదట్లో ఘంటసాల అమెరికా వెళ్ళారు. అక్కడ ఆయన్ని మీడియా వారు ఇంటర్వ్యూలు చేసినపుడు ఆయన చెప్పిన మాటలు ఆసక్తికరం. తన వారసుడు ఎవరు అని అడిగినపుడు ఆయన చెప్పిక ఒకే ఒక పేరు బాలసుబ్రమణ్యం అని. అంటే బాలు ప్రతిభను ఆయన ఆదిలోనే గుర్తించారన్న మాట.
బాలు తన తరువాత నంబర్ వన్ స్థానానికి చేరుకుని గొప్ప గాయకుడు అవుతాడని ఘంటసాల ఊహించి ఆలా ఆశీర్వదించారు. ఇక ఘంటసాల తన సంగీత దర్శకత్వంలో కూడా అనేక పాటలను బాలు చేత పాడించి బాగా ప్రోత్సాహించారు.
మొత్తం మీద చూసుకుంటే బాలు ఘంటసాల తరువాత అగ్ర స్థానంలో కొనసాగడమే కాకుండా అందరు నటులకూ తానే పాడి తన సత్తా చాటుకున్నారు. మొత్తానికి ఘంటసాల మాస్టారు సిసలైన సినీ వారసుడు బాలు అని చెప్పాలి.
బాలు నాటి అగ్ర నటులకే కాదు, తరువాత మూడు తరాలకు తన గొంతు అరువిచ్చి గ్రేట్ అనిపించుకున్నారు. అంతే కాదు, అయిదు దశాబ్దాలుగా తిరుగులేని గాయకుడిగా ఉంటూ అన్ని భాషలలో యాభైవేల పాటలను పాడారు.