తెలుగు చిత్ర పరిశ్రమకు లభించిన సాహిత్య పిపాసకుల్లో తనికెళ్ల భరణి ఒకరు. కవిగా, మాటల రచయితగా, నటుడిగా ఆయన సినీ ప్రస్థానం ఒక అద్భుతం. శివతత్వం గురించి ఆయన చెప్తుంటే విని తీరాల్సిందే. ఆయన కవితామృతానికి ఫిదా అవని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. సినీ కళకారుల్లో కూడా ఆయనకు అభిమానులు ఎక్కువే. పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన పూనమ్ కౌర్ తనికెళ్ల భరణి గురించి ఓ కవితే రాసింది. ఆయన సినీ జీవితానికి నిలువుటద్దంలా నిలిచిన కవిత ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

 

భరణి గురించి పూనమ్ రాసిన కవిత..

“నేను నటుడినే. కానీ, నిజ జీవితంలో నటించలేకపోయాను.

ఔను.. నేను కళాకారుడినే.. కానీ కళామతల్లి మీద ప్రేమ అభిమానంతో, కళ విలువ తెలియకుండా నా దగ్గరికి వచ్చే ప్రతి మనిషికి నేను నా కళని అమ్ముకోలేకపోయాను.

సాహిత్యం పట్ల ప్రేమతో, మన భారతదేశంలో ఉన్న సంస్కృతిని మరింతగా వికసింపచేయాలని ఒక చిన్న ఆశ. ఆ భావంతో, మనసు నిండా అదే ఆలోచనతో నేను నా ప్రతి నాటకం రాశా.

డబ్బు గురించి మాట్లాడితే.. అవసరాలు కొన్ని, ఆశయాలు కొన్ని తీర్చుకున్నాను.

అమ్మ శ్రీ మహాలక్ష్మీ ప్రేమతో,కరుణతో , మర్యాదతో వచ్చినప్పుడు శిరసు వంచి అందుకున్నాను.

నా దగ్గరికి వచ్చిన మనిషి అహంభావం చూపించినా, నేను ప్రేమతోనే చూశాను. కానీ, నాలో ఉన్న కళా దైవాన్ని మాత్రం ఏరోజు అహంతో పంచుకోలేకపోయాను.

వెనకడుగు వేసే ప్రతి నిమిషం కుటుంబ అవసరాలు గుర్తుకు వచ్చేవి. కానీ నా స్వార్ధం కోసం నేను అత్యంత గౌరవాన్ని ఇచ్చే కళామతల్లిని నేను అమ్ముకోలేకపోయాను.

పూజ చేశాక, మా ఆవిడ నా నుదుటిన పెట్టిన బొట్టుతో నా పాదం బాధ్యతతో బయటకు కదిలేది.

నాకు తోడుగా ఎప్పటికీ ఉంటాను అని మా ఆవిడ అంటే, నీ సహాయం లేకుండా ఈ జీవితం ఎలా గడిపేది అంటాను నేను.

పిల్లలందిరీ నేను కోరుకునేది ఒకటే. అమ్మ అనే బంధానికి ప్రేమని పంచండి. నాన్న అనే పదంతో స్నేహం పెంచుకోండి. ఇంతకంటే ఎక్కువ ఏమీ ఆశల్లేని నేను.. మీ తనికెళ్ల భరణి”

 

 

తనికెళ్ల భరణి జీవితానుభవాన్ని తరిమి చూసినట్టు పూనమ్ రాసిన ఈ కవిత ప్రస్తుతం వైరల్ అయింది. నెటిజన్లు ఆమెలోని కవితా హృదయానికి ఫిదా అయిపోతున్నారు. తెలుగులో ఆమె రాసిన విధానానికి ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: