ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ సినిమా అభిమానులు మొత్తం 'ఆర్ఆర్ఆర్' సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా 'ఆర్.ఆర్.ఆర్' మాటే వినిపిస్తోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్). ఇందులో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్చరణ్ నటిస్తున్నారు. ఈ సినిమాను పది భాషల్లో వచ్చే ఏడాది జనవరి 8న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ ఏడాది ఉగాది సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర ఫస్ట్ లుక్ మోస్టర్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఆ తరవాత రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ప్రత్యేక వీడియో సినిమా అంచనాలను రెట్టింపు చేసింది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే అధిక భాగం పూర్తవ్వగా మిగతాది లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే స్టార్ట్ చేస్తారని సమాచారం.
ఇదిలా ఉండగా ఇప్పుడు దేశంలో అన్ని ప్రాంతాలకూ ఇష్టం వచ్చినట్లు తిరిగే పరిస్థితి లేదు. దీంతో కథ రీత్యా ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా ఇప్పుడు ఆ వాతావరణాన్ని మన దగ్గరే తీసుకొచ్చేలా సెట్స్ వేసి మేనేజ్ చేసుకోవాల్సిందే. ఆర్.ఆర్.ఆర్. చిత్ర యూనిట్ కూడా అదే ప్లాన్ లో ఉన్నారట. ఈ సినిమాలో కొన్ని భారీ సన్నివేశాల కోసం మహారాష్ట్రలోని పుణెలో సెట్టింగ్స్ వేయాలని అనుకున్నారు. సాబు సిరిల్ బృందం అక్కడ రెక్కీ నిర్వహించి సెట్స్ వేసేందుకు ప్రణాళికలు పూర్తి చేసింది. కానీ దేశంలో అత్యధిక కరోనా కేసులున్న మహారాష్ట్రకు రాబోయే కొన్ని నెలలు వెళ్లే పరిస్థితి ఉండదు. లాక్ డౌన్ ఎత్తేశాక కూడా ఆ రాష్ట్రానికి వెళ్లడం ఇబ్బందికరమే. దీంతో హైదరాబాద్లోనే ఆ సెట్టింగ్స్ ఏవో వేసి షూటింగ్ అంతా ఇక్కడే జరపాలని నిర్ణయించారు. ప్రస్తుతం సాబు సిరిల్ బృందం ఇందుకు అనుగుణంగా ప్లానింగ్ మారుస్తోంది. ఇక్కడ లాక్ డౌన్ ఎత్తేసి షూటింగులకు అనుమతి ఇవ్వగానే సెట్స్ నిర్మాణం జరగబోతోందని సమాచారం.