ఈదర వీర వెంకట సత్యనారాయణ తెలుగు సినిమా రంగానికి పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు సినిమా రంగంలో తనకంటూ మాత్రమే ప్రత్యేకమైన హాస్యాన్ని పండించడంలో శైలీని కలిగి ఉన్నారు. 1956 జూన్ 10వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని దొమ్మేరులో జన్మించారు. ఆయనది రైతు కుటుంబం. నాన్న వెంకటరావు, అమ్మ వెంకటరత్నం. ఈయన కుటుంబానికి దొమ్మేరులో 70 ఎకరాల పొలం ఉండింది. బాల్యం నుండి సినిమాలంటే ఆసక్తితో కనీసం వారానికి రెండు సినిమాలైన చూసేవాడు. ఇంటర్మీడియట్ వరకు బుద్ధిగానే చదివినా, ఇంటర్కు నిడుదవోలు వెళ్ళిన సత్యనారాయణ కాలేజికి వెళ్ళకుండా రోజూ ఉదయం ఆట, మధ్యాహ్నం ఆట సినిమాలను చూడటంతో హాజరు తక్కువై ఇంటర్మీయడ్ తప్పాడు.
చివరకు ఆయన్ను పొలం పనులు చూసుకోవాలని తండ్రి వార్నింగ్ ఇచ్చారు. 19 యేళ్ళకే 1976లో సరస్వతి కుమారితో పెళ్ళైంది. తర్వాత ఇద్దరు కొడుకులు పుట్టారు. వీళ్ళకు రాజేష్, నరేష్ అని పేరు పెట్టారు. వ్యవసాయంలో భారీ నష్టాలతో ఇళ్లు అమ్మేశారు. చివరకు ఎక్కడికి అయినా వెళ్లి బతకాలని అనుకుంటున్న టైంలో ఈవీవీ స్నేహితుడు నిర్మాత నవతా కృష్ణంరాజు మేనల్లుడైన సుబ్బరాజును సంప్రదించి ఒక సిఫారుసు ఉత్తరం పట్టుకుని మొదటిసారి మద్రాసు వెళ్ళాడు. నవతా కృష్ణంరాజును కలిసి ఉత్తరం ఇవ్వగా ఆయన సినీరంగంలో జీవితం అనుకున్నంత సులభం కాదని, తిరిగి సొంత ఊరికి వెళ్ళిపొమ్మని హితవు చెప్పాడు.
ఇంటికి వెళ్లినా చేసేదేం ఉండదని.. నిర్ణయించుకున్న ఆయన మద్రాస్లోనే మకాం వేశారు. చివరకు ప్రతి రోజు ఉదయం నవత కృష్ణంరాజు కార్యాలయం గేటు వద్ద నుంచుని ఉండేవాడు. ఒక నెలరోజుల తర్వాత కుర్రవాని పట్టుదలను చూసి ఏం చెయ్యగలవు అని అడిగాడు. సహాయ దర్శకున్ని అవుతానని చెప్పిన ఈవీవీని చివరకు రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల దగ్గర ఓ ఇంటి భాగోతం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఛాన్స్ ఇచ్చారు. ఇక అక్కడ నుంచి ఆయన అంచెలంచెలుగా ఎదిగి తిరుగులేని డైరెక్టర్ అయ్యారు.
1990లో చెవిలోపువ్వు సినిమాతో దర్శకుడిగా పరిచయం అయినకు రెండో సినిమా ప్రేమఖైదీతో తిరుగులేని క్రేజ్ వచ్చింది. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్పై డి.రామానాయుడు నిర్మించిన ఈ సినిమా తిరుగులేని బ్లాక్ బస్టర్ రికార్డులు బద్దలు కొట్టింది. ఆ తర్వాత అప్పుల అప్పారావు, సీతారత్నం గారి అబ్బాయి, జంబలడికిపంబ, ఏవండీ ఆవిడ వచ్చింది, వారసుడు, హలో బ్రదర్, ఆమె, అల్లుడా మజాకా, ఆయనకు ఇద్దరు, ఇంట్లో ఇల్లాలు.. వంటింట్లో ప్రియురాలు, అదిరింది అల్లుడు, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, తాళి, మానాన్నకు పెళ్లి, ఆవిడా మాఆవిడే, మావిడాకులు, కన్యాదానం,సూర్యవంశీ, సూర్యవంశం, పిల్లనచ్చింది, చాలాబాగుంది సినిమాలు తీశారు. ఇక తన పెద్ద కుమారుడు ఆర్యన్ రాజేష్ హీరోగా హాయ్ సినిమా తీశారు.
ఇక తన రెండో కుమారుడు అల్లరి నరేష్ హీరోగా ఎన్నో విజయవంతమైన సినిమాలు తీశారు. ఆయన ఎంతో మంది స్టార్ హీరోయిన్లను పరిచయం చేశారు. రంభ, రచన, ఊహా, రవళిని ఈవీవీ వెండితెరకు పరిచయం చేశారు. ఇక ఈవీవీ చిన్న వయస్సులోనే 51 సినిమాలు తీయడంతో పాటు తెలుగు సినిమా రంగంలో ఎప్పటకీ తనదైన ముద్ర వేశారు. చాలా చిన్న వయస్సులోనే ఆయన మనందరికి దూరమవ్వడం బాధాకరం. ఈవీవీ లేకపోయినా ఆయన సినిమాల ద్వారా మన మనస్సుల్లో ఎప్పటకీ తనదైన ముద్ర వేసుకున్నారనే చెప్పాలి. ఇక ఆయన వారసుల్లో ఆర్యన్ రాజేష్ హీరోగా నిలదొక్కుకోలేకపోయినా.. నరేష్ మాత్రం అటు హీరోగాను.. ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే రాణిస్తున్నాడు.