ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచదేశాల ప్రజలను ముచ్చెమటలు పట్టిస్తుతంది. మొదట చైనాలో వెలుగుచూసిన ఈ మహమ్మారి అతి తక్కవ సమయంలోనే దేశదేశాలు విస్తరించి.. అనేక మంది ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 22 లక్షలు దాటింది. మరోవైపు మరణాలు సంఖ్య సైతం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. అయితే చైనాలో పుట్టిన ఈ వైరస్ అక్కడకంటే.. ఇతర దేశాల్లో మరణాల సంఖ్య పెరగడం గమనార్హం. ఇక ఈ మహమ్మారి ముందు ధనికుడు.. పేదవాడు అని భేదం లేదు. చిన్నా.. పెద్దా అని తేడా లేదు.
ఎవరైనా.. ఎంతటి బలవంతుడైనా కరోనా ముందు తలవంచాల్సిందే అన్న రీతిలో ప్రస్తుత పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ కరోనా మహమ్మారి హాలీవుడ్ ఇండస్ట్రీపై కోరాలు చూస్తూనే ఉంది. ఇప్పటికే కరోనా సోకి ఎందరో ప్రముఖులు మృతి చెందగా.. తాజాగా మరో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ను మృత్యువు కరోనా రూపంలో వచ్చి కబళించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రఖ్యాత హాలీవుడ్ కెమెరామేన్ అల్లెన్ డీవియో (77) కరోనా సోకి మరణించారు. ఈటీ, డి కలర్ పర్పుల్, ఎంపైర్ ఆఫ్ డి సన్ వంటి పాపులర్ సినిమాలకు కెమెరామేన్గా పని చేసి మంచి పేరు సంపాదించుకున్నారీయన.
అంతేకాకుండా, అల్లెన్ డేవియో ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలో ఐదుసార్లు ఆస్కార్ నామినేషన్ కూడా పొందారు. అలాగే 2007లో అమెరికన్ సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆయనకు జీవిత సాఫల్యత పురస్కారాన్ని అందించింది. ఇక దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్తో ఎక్కువ సినిమాలు కలసి పని చేశారు అల్లెన్. అయితే అల్లెన్కి వారం క్రితం కరోనా సోకినట్టు నిర్ధారణ కాగా, కొద్ది రోజులుగా వెస్ట్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే పరిస్థితి రోజురోజుకు విషమించడంతో.. తన ఇంట్లోనే చనిపోవాలని అల్లెన్ కోరాడట. దీంతో కుటుంబ సభ్యులు, న్యాయవాదులు అతనిని ఇంటికి తీసుకెళ్ళారు. ఇక అక్కడే ఆయన కన్ను మూసినట్టు తెలుస్తోంది.