2001వ సంవత్సరంలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, కరీనా కపూర్ కలిసి నటించిన అశోక సినిమాలో తమిళ హీరో అజిత్ కుమార్ మొట్టమొదటిగా కనిపించారు. ఆ సినిమా తర్వాత అజిత్ కుమార్ మళ్లీ ఇంతవరకు ఏ బాలీవుడ్ సినిమాలో నటించలేదు. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం... తలా గా పిలవబడే అజిత్ కుమార్ మళ్ళీ బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడు అని తెలుస్తోంది. అజిత్ హీరోగా నటించిన ఆరంభం, బిల్లా లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ విష్ణువర్ధన్ ఓ హిందీ సినిమా కోసం స్క్రిప్టుని రాసుకున్నాడట.


అయితే తాను తీయబోయే సినిమా కార్గిల్ యుద్ధంపై ఆధారపడి ఉండగా... హీరోగా బాలీవుడ్ కుర్ర హీరో సిద్ధార్థ మల్హోత్రా నటిస్తున్నాడు. ఈ సినిమా లోని ఆర్మీ మేజర్( రియల్ విక్రమ్ బాత్రా నుండి ఇన్స్పైర్ అయిన పాత్ర) పాత్రలో అజిత్ కుమార్ కరెక్ట్ గా సరిపోతాడని డైరెక్టర్ విష్ణువర్ధన్ భావించాడట. అందుకే అతనికి వెంటనే ఫోన్ చేసి తన సినిమాలో నటించవలసిందిగా కోరాడట. తనకి రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చిన విష్ణువర్ధన్ మాట కాదనలేని అజిత్ వెంటనే ఓకే చెప్పేశాడని సినీ వర్గాల నుండి టాక్ వినిపిస్తోంది. కాగా, అధికారిక ప్రకటన భవిష్యత్తులోనే రానున్నట్టు తెలుస్తుంది.


ఇకపోతే కొన్ని నెలల క్రితం హీరో అజిత్ కుమార్, డైరెక్టర్ విష్ణువర్ధన్ కలిసి ఒక చారిత్రాత్మక సినిమా చేయాలని భావించారు. అందుకుగాను నిర్మాత ఏ.ఎం రత్నం ని కూడా సంప్రదించారు. కానీ సినిమా బడ్జెట్ చాలా ఎక్కువగా వచ్చే సరికి ఆ చారిత్రాత్మక సినిమాని తీసేందుకు ఇష్టపడలేదు. ఏది ఏమైనా మళ్లీ విష్ణువర్ధన్ సినిమాలో తలా అజిత్ కుమార్ నటించబోతున్నాడు. మరోవైపు తాను 'వలిమై' అనే సినిమాలో హీరోగా నటిస్తుండగా... దానికి బోనికపూర్ నిర్మాతగా బాధ్యతలు చేపట్టగా... డైరెక్టర్ హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఒకవేళ సోలోగా అజిత్ కుమార్ బాలీవుడ్ సినిమా తీసేందుకు ఆసక్తి చూపితే తాను ఆ సినిమా నిర్మించేందుకు సిద్ధంగా ఉంటానని బోనీకపూర్ ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: