దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ సినిమా ఆర్ ఆర ఆర్. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై డీవీవీ దానయ్య రు. 300 కోట్ల పై చిలుకు భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం లాక్డౌన్ నేపథ్యంలో ఆగిపోయింది. ఇక సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 8వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలోనే లాక్డౌన్లో ఉన్న రాజమౌళి ఓ టీవీ ఛానెల్ లైవ్లో పాల్గొన్నారు.
ఇద్దరు చరిత్ర కారులకు సంబంధించి ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తోన్న నేపథ్యంలో విమర్శలు రావా ? అన్న ప్రశ్నకు రాజమౌళి తనదైన శైలీలో స్పందించారు. ఇది చరిత్రలో పోరాటం చేసిన ఇద్దరు వీరులు కలిస్తే ఎలా ఉంటుందన్న నేపథ్యంలో రాసుకున్న కథ అని.. అంతే కాని తాము చరిత్రను మార్చలేదని చెప్పారు. వాళ్లిద్దరి ఆలోచనలు ఒకరు ఒకరు షేర్ చేసుకుని ఉంటే ఏం జరిగి ఉండేదన్న కల్పిత కథాంశంతోనే ఈ సినిమా తీస్తున్నట్టు చెప్పారు.
అయితే రాజమౌళి ఇది పూర్తిగా కల్పిత కథ అని చెపుతున్నా అటు అల్లూరి, ఇటు కొమరం భీమ్ ఇద్దరు చరిత్రతో ముడిపడి ఉన్న స్వాతంత్య్రోదమ్య కాలం నాటి వీరులు కావడంతో చరిత్ర కారులు ఖచ్చితంగా ఏదో ఒక అభ్యంతరం వ్యక్తం చేస్తారన్న సందేహాలే ఉన్నాయి. అయితే ఇవి సినిమాకు మరింత హైప్ తెస్తాయా ? లేదా ఇబ్బందులు కలిగిస్తాయా ? అన్నది చూడాలి.