జీవితంలో ఎదిగేందుకు ప్రతి వ్యక్తి తాను ఎంచుకున్న రంగంలో కష్టపడుతూంటాడు. ఇటువంటి కష్టం అన్ని రంగాల్లో ఒకేలా ఉన్నా.. ముఖ్యంగా సినిమా రంగంలో మాత్రం మరింత కష్టంగా ఉంటుంది. సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉండే సినిమాల్లో సక్సెస్ కావాలంటే తెలివితేటలు, కష్టం, అదృష్టం అన్నీ సమపాళ్లలో ఉండాల్సిందే. దర్శకుడిగా ఓ దశలో నెంబర్ వన్ పొజిషన్ ఎంజాయ్ చేసిన పూరి జగన్నాధ్ తొలినాళ్లలో ఇంత కష్టం అనుభవించాడు.
ఈ విషయాలను, 20 ఏళ్ల పూరి కెరీర్ ను, అతను పడ్డ కష్టాన్ని సంగీత దర్శకుడు రఘు కుంచె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దాదాపు పదేళ్లుగా ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ డైరక్టర్ గా పని చేశాడు. కథలు రాయడంలో స్పెషలిస్ట్ అయిన పూరి తన దగ్గరున్న కథల్లో ఒక దానిని హీరో కృష్ణకు వినిపించి దానికి టైటిల్ గా థిల్లానా అని పెట్టుకున్నాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగిన తర్వాత ఆగిపోయింది. కష్టానికి అలవాటు పడ్డ మనిషి ప్రయత్నాలు ఆపడు. థిల్లానా ఆగిపోయినా మరో కథతో హీరో సుమన్ కు వినిపించడం జరిగింది. ‘పాండు’ టైటిల్ తో సినిమా షూటింగ్ ప్రారంభమై అనివార్య కారణాలతో ఆ సినిమా కూడా ఆగిపోయింది.
పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినా అధైర్యపడలేదు పూరి. లవ్ స్టోరీ ట్రెండ్ నడుస్తున్న సమయంలో ఓ కథ రాసుకున్నాడు. కెరీర్ పీక్స్ లో ఉన్న పవన్ కల్యాణ్ తో సినిమా కోసం చోటా కె నాయుడు సహకారంతో ప్రయత్నాలు చేసి ఒప్పించగలిగాడు. నిర్మాత త్రివిక్రమరావును ఒప్పించడంతో పూరి కల నెరవేరింది. అదే బద్రి. అక్కడి నుంచి ఈ ఇరవై ఏళ్లలో పూరి జైత్రయాత్ర నడుస్తున్న చరిత్ర. కాళ్లరిగేలా తిరిగి టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక పేజీ రాసుకున్నాడు.
A small Story About @purijagan 20 years journey of cinema .. From my heart ❤️ pic.twitter.com/ys3eup8UKY
— raghu kunche (@kuncheraghu) April 20, 2020