టాలీవుడ్ లో‘అల వైకుంఠపురములో’ మూవీ భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు ‘పుష్ప’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గతంలో ఆర్య, ఆర్య2 లాంటి హిట్ సినిమాలు అందించిన సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప’ మూవీ ఫస్ట్ లుక్ ఆ మద్య పుట్టిన రోజు కానుకగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీలో అల్లు అర్జున్ ఊరమాస్ లుక్ తో కనిపిస్తున్నాడు. దీనికి భారీ స్పందన వచ్చింది. చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం సాగనుంది.
ఇందులో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీలో మరో హీరోయిన్కు కూడా అవకాశం ఉందని తెలుస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా మలయాళంలో పలు చిత్రాల్లో నటించిన ముద్దుగుమ్మ నివేదా థామస్ నాని 'జెంటిల్ మన్' సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. తరువాత 'నిన్ను కోరి', 'జైలవకుశ' సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల మురుగదాస్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన ‘దర్బార్’ మూవీలో ఆయన కూతురుగా నటించి మెప్పించింది. మలయాళ మూవీ వెరుథె ఒరు భార్య సినిమాలోని ఆమె నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు పొందింది.
ఈ అమ్మడి నటన ఎంతో నేచురల్ గా ఉంటుందని టాక్. ఆ మద్య బ్రోచేవారెవరురా.. సినిమాతో మంచి హిట్ అందుకున్నవిషయం తెలిసిందే. ఇప్పుడు బన్నీతో కూడా నటించే అవకాశం కూడా అమెకు లభించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, దీనిపై సినిమా యూనిట్ నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది. కాగా, కరోనా లాక్డౌన్ వల్ల సినిమా షూటింగ్ ఆగిపోయిన విషయం తెలిసిందే. కలప స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొంటున్నాయి. త్వరగా షూటింగ్ పూర్తి చేసుకొని బన్ని ‘పుష్ప’ ఎప్పుడు థియేటర్లోకి వస్తుందాని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.