డైలాగ్ కింగ్ సాయికుమార్.. గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీ తో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరో గానే కాకుండా క్యారెక్టర్ యాక్టర్ గా కూడా నటించారు. ఎలాంటి పాత్రలైనా అలవోకగా చేసే యాక్టర్ ఈయన. అయితే రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్తే అప్పటికి సాయికుమార్ ను ఒక స్టార్ డబ్బింగ్ ఆర్టిస్టుగా మాత్రమే గుర్తించేవాళ్లు. నటుడిగా చిన్నా చితకా వేషాలు వేసినా అవేమీ ఆయనకు పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. అలాంటి స్థితిలో ‘పోలీస్ స్టోరీ’ సినిమా సాయికుమార్ కెరీర్నే మలుపు తిప్పేసింది.
అంతకు ముందు వేరే హీరోలకు డబ్బింగ్ చెబుతూ వచ్చిన సాయి కుమార్.. ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ దక్కించుకున్నాడు. థ్రిల్లర్ మంజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయికుమార్, పి. జె. శర్మ, సత్యప్రకాశ్ నటించగా, సాధు కోకిల సంగీతం అందించారు. ఈ సినిమాలో ఓ ప్రధాన ఆకర్షణ సాయి కుమార్ చెప్పిన డైలేగే అని చెప్పాలి. ‘కనిపించే మూడు సింహాలు న్యాయానికి, ధర్మానికి, చట్టానికి ప్రతీకలైతే.. ఆ కనిపించని నాలుగో సింహమేరా పోలీస్’ అంటూ సాయి కుమార్ గారు చెప్పిన ఈ డైలాగ్ ఎప్పటికి మరచిపోలేము.
సాయికుమార్ పోలీస్ పాత్రలో చెప్పిన ఒక డైలాగ్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఈ డైలాగ్ మిమిక్రీ కళాకారులకు ఓ వరమని చెప్పుకోవాలి. అంతగా ఆ డైలాగ్ జనాల్లోకి వెళ్ళింది. ఈ సినిమా వచ్చి 24 ఏళ్లు అవుతున్నా సాయికుమార్ పలికిన ఆ డైలాగ్ పవర్ ఇంకా తగ్గలేదు. ఇప్పటికీ ఏదో ఒక సినిమాలో ఈ డైలాగ్ను యూజ్ చేసేస్తుంటారు. ఏదేమైనా సాయికుమార్ డైలాగ్ మాత్రం ఇప్పటికీ.. ఎప్పటికీ ఎవర్ గ్రీనే. అంతేకాదు.. ఈ సినిమా సాయికుమార్ పేరు సౌత్ ఇండియా అంతటా మార్మోగిపోయేలా చేసింది. మరియు కన్నడలో రూపొందిన పోలీస్ స్టోరీ చిత్రాన్ని తెలుగు, తమిళ్, హిందీ లోనూ రిలీజ్ చేసారు. ఇక పోలీస్ స్టోరీ రిలీజ్ చేసిన అన్ని భాషల్లో విశేష ప్రేక్షకాదరణతో బ్లాక్ బష్టర్ అవ్వడం మరో విశేషం.