ప్రస్తుత లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా సినిమా థియేటరర్స్, మల్టీప్లెక్సెస్, మాల్స్ బంద్ అయిపోయాయి. దీంతో సినిమాల విడుదలలన్నీ నిలిచిపోయాయి. అందులోనూ ఇప్పుడప్పుడే థియేటర్లు ఓపెన్ అయ్యేలా కనిపించడం లేదు. థియేటర్స్ పూర్తిగా మూసేయడంతో డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్, థియేటర్స్ నిర్వాహకులు తీవ్ర గడ్డుకాలాన్ని ఎదర్కొంటున్నారు. సినిమాల కోసం ఫైనాన్సియర్ల దగ్గర డబ్బులు తీసుకున్న కొందరు చిన్న నిర్మాతలు వడ్డీలు భరించలేక డైరెక్ట్ గా ఓటీటీ రిలీజ్ చేయడమే శరణ్యమని భావిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన సినిమాలను ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ద్వారా రిలీజ్ చేయాలని కొందరు నిర్మాతలు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలకు అమేజాన్ ప్రైమ్, నెటిఫ్లిక్స్ వంటి ఓటీటీల నుంచి భారీ ఆఫర్లు వస్తున్నాయి. జ్యోతిక ప్రధాన పాత్రలో ఆమె భర్త, తమిళ స్టార్ హీరో సూర్య నిర్మించిన చిత్రం 'పొన్మగల్ వంధాల్'. ఈ సినిమాను డైరెక్ట్గా అమేజాన్ ప్రైమ్లో విడుదల చేయాలని సూర్య నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ తో ఓ ఒప్పందం కుదుర్చుకోవడం కూడా జరిగిందట.
అయితే ఈ నిర్ణయంపై తమిళనాడు థియేటర్స్ యాజమాన్య సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటువంటి చర్యల వల్ల థియేటర్స్ పూర్తిగా మూసివేసే పరిస్థితి వస్తుందని.. తమను రోడ్డు మీద పడేసే చర్యలు మానుకోవాలని థియేటర్ ఓనర్స్ సూచిస్తున్నారు. అంతేకాకుండా సూర్యను హెచ్చరిస్తూ తమిళనాడు థియేటర్స్ యాజమాన్య సంఘం ప్రధాన కార్యదర్శి పన్నీర్ సెల్వం ఓ వీడియోను విడుదల చేశారు. 'సినిమాలను పూర్తిగా థియేటర్లను దృష్టిలో ఉంచుకునే తెరకెక్కిస్తారు. సూర్య నిర్మించిన చిత్రం డైరెక్ట్గా ఓటీటీలో విడుదల కావడాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. ఓటీటీలో విడుదల చేయాలనే నిర్ణయాన్ని సూర్య వెనక్కి తీసుకోవాలి. లేకపోతే సూర్య నటించిన, నిర్మించిన సినిమాలపై నిషేధం విధిస్తాం. ఆయన సినిమాలను థియేటర్లలో విడుదల కానివ్వం' అని పన్నీర్ సెల్వం పేర్కొన్నారు.