మహానటి సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన మహానటి చిత్రంతో ఎనలేని పేరు సంపాదించింది కీర్తి సురేష్. ఆమె మరో బయోపిక్లో నటిస్తోందంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. గిన్నిస్ బుక్ రికార్డ్ హోల్డర్.. నటి, దర్శకురాలు విజయనిర్మల జీవిత కథలో ఆమె నటించనుందని ఇటీవల వార్తలొచ్చాయి. ఐతే ఈ ప్రచారాన్ని విజయనిర్మల తనయుడు నరేష్ ఖండించాడు. తన తల్లి బయోపిక్ తాలూకు హక్కులు తాము ఎవరికీ ఇవ్వలేదని.. ఈ బయోపిక్ గురించి ఎలాంటి సమాచారం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఐతే విజయ నిర్మల బయోపిక్ తెరకెక్కదని మాత్రం నరేష్ చెప్పలేదు. ఇందుకు తనే స్వయంగా సన్నాహాలు చేస్తున్నట్లు నరేష్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. విజయ నిర్మల గత ఏడాది జూన్లో మృతి చెందిన సంగతి తెలిసిందే. అంతకంటే ముందే తన జీవిత కథను రాయాలని తల్లి తనకు చెప్పిందని నరేష్ తెలిపాడు. దీంతో ఆ పని మొదలుపెట్టానని.. అంతలోనే తల్లి ఆరోగ్య పరిస్థితి విషమించడం.. తర్వాత ఆమె చనిపోవడంతో ఆ పనిని పక్కన పెట్టేసినట్లు నరేష్ వివరించాడు. ఇప్పుడు మళ్లీ తల్లి జీవిత కథను రాసే పనిలో ఉన్నట్లు నరేష్ తెలిపాడు.
సినిమా తీసేందుకే ఈ పని జరుగుతోందని.. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన తన తల్లి జీవితంలో అనేక కోణాలు, మలుపులు ఉన్నాయని.. ఎంతోమందితో మాట్లాడి, పరిశోధించి ఆమె బయోపిక్ కోసం స్క్రిప్టు తయారు చేయాల్సి ఉందని.. ఇందుకు ఏడాదికి పైగా సమయం పడుతుందని నరేష్ తెలిపాడు. స్క్రిప్టు రెడీ అయ్యాక సినిమా విషయంలో ఏం చేయాలా అన్నది ఆలోచిస్తామని.. తనే స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తీస్తానా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేనని నరేష్ చెప్పాడు. ఏదేమైనా మహానటి విజయనిర్మల బయోపిక్ వస్తే తెలుగు సినీ లవర్స్కు అంతకు మించి కావాల్సింది ఏముంటుంది ? అయితే దీనిని ఓ క్లాసిక్గా మలచాల్సిన బాధ్యత మాత్రం ఈ టీంపై ఉంది.