మన కోసం ఇంటి దగ్గర ఎంతో కష్టపడే భార్యలకు ఇప్పుడు మనం రుణం తీర్చుకునే సమయం వచ్చిందంటున్నారు టాలీవుడ్ స్టార్లు. ఈ క్రమంలో మహిళలకు పనిభారం తగ్గించేందుకు టాలీవుడ్‌లో వినూత్నమైన ఛాలెంజ్ కి శ్రీకారం చుట్టారు. తమ ఇళ్లలోని మహిళలను ఇలాంటి కష్టకాలంలో మరింత కష్టపెట్టలేరని.. ఇంటి పనులు చేస్తూ సాయపడతారని వారే నిజమైన మనుషులంటూ అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా 'బీ ది రియల్ మ్యాన్' ఛాలెంజ్‌ ను మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ లాక్‌ డౌన్ వేళ ఇంట్లో అసలు సిసలు మనిషిగా ఉండండి అంటూ ‘బీ ద రియల్ మ్యాన్’ అనే ఛాలెంజ్‌ను విసురుతున్నారు తెలుగు సినీ ప్రముఖులు. ఇప్పటికే రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, సుకుమార్, కీరవాణి ఇలా స్టార్ హీరోలు దర్శకులు ఇంట్లో వాళ్ల భార్యలకు సాయం చేస్తూ వీడియోలను విడుదల చేసి వాళ్లు కూడా మరికొంత మందిని నామినేట్ చేస్తున్నారు. ఈ  క్రమంలో ఛాలెంజ్ ని పూర్తి చేసిన లెక్కల మాస్టర్ సుకుమార్ ఈ సవాలుని స్వీకరించవలసిందిగా మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ని నామినేట్ చేసాడు. 

 

ఇప్పుడు తాజాగా దేవిశ్రీ కూడా సుక్కు విసిరిన ఛాలెంజ్‌ను పూర్తి చేశాడు. ఇంటిని శుభ్రం చేశాడు.. అలాగే కిచెన్ లోకి వెళ్లి ఆమ్లెట్ వేసి తల్లికి తినిపించాడు. తర్వాత ఆ ప్లేట్ కడిగేసాడు. తన తండ్రి ఫోటోను తుడిచి అమ్మ దగ్గరకి వెళ్లి కౌగిలించుకున్నాడు. ఆ వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. రియల్ మ్యాన్ లను తయారు చేసిన 'అమ్మ'లందరికీ ఈ వీడియో అంకితం అంటూ ఛాలెంజ్ ఎండ్ చేసాడు. అనంతరం ఇలాంటి ఎంటర్టైనింగ్ ఎఫర్ట్స్ పెట్టిన సందీప్ వంగా, రాజమౌళి, చిరంజీవి లను ట్యాగ్ చేస్తూ ఈ ఛాలెంజ్‌ ను కొనసాగించాల్సిందిగా అల్లు అర్జున్, తమిళ హీరో కార్తీ, కన్నడ హీరో యశ్, దర్శకుడు హరీష్ శంకర్, దిగ్గజ నటుడు మోహన్‌లాల్‌ లను నామినేట్ చేశాడు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: