‘సినిమా’ లేకపోతే కళాకారులు లేరు.. ప్రజలకు వినోదం లేదు. ప్రజలకు సినిమా తమ జీవితంలో భాగం. మానసిక ప్రశాంతత కోసం ప్రజలు ఎంచుకునే సాధనం సినిమానే. ఇంతటి శక్తివంతమైన మాధ్యమాన్ని ప్రజలకు అందించిన మహానుభావుడు డూండీ రాజ్ గోవింద్ ఫాల్కే. ఆయనే దాదాసాహెబ్ ఫాల్కేగా ప్రసిధ్దులయ్యారు. సరిగ్గా 107 సంవత్సరాల క్రితం భారతదేశంలో ‘రాజా హరిశ్చంద్ర’ పేరుతో మూకీ సినిమా తీసి భారతీయ సినీ పితామహుడిగా వినుతికెక్కారు. ఫాల్కే తెరకెక్కించిన ఈ సినిమాను 1913 మే 3న అప్పటి బొంబాయిలోని గిర్గాన్ ప్రాంతంలోని కొరోనేషన్ సినిమా లో ప్రదర్శించారు.
అలా భారతీయ గడ్డపై నిర్మితమై.. ప్రదర్శితమైన తొలి చిత్రంగా రాజా హరిశ్చంద్ర నిలిచిపోయింది. అప్పటి నుంచి దేశంలో సినిమా వేళ్లూనుకుంది. 1931లో తొలి టాకీ మూవీగా ఆలం ఆరా వచ్చింది. ముఖ్యంగా దేశ స్వాతంత్ర్యానంతరం సినిమా బాగా విస్తరించింది. ప్రాంతీయ భాషలు ఎక్కువగా ఉన్న భారత్ లో ప్రాంతీయ భాషా సినిమాలు ఎక్కువగా నిర్మితమయ్యాయి. ప్రేక్షకాదరణ పెరిగింది. దేశంలో సినిమా ఒక పరిశ్రమగా ఎదిగింది. ఎందరో కళాకారులు ప్రజలకు ఆరాధ్య నటులయ్యారు. ఎందరో ప్రతిభావంతులు దర్శకులుగా మారి అనేక కథలను తెరకెక్కించారు. ప్రపంచపటంలో భారతీయ సినిమాకు ఎనలేని గుర్తింపును తీసుకొచ్చారు.
దశాబ్దం మారేకొద్దీ సినిమాలో మార్పులు వచ్చాయి. మూకీ నుంచి టాకీ, బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్, 35 ఎంఎం నుంచి సినిమా స్కోప్, స్టీరియో ఫోనిక్ సౌండ్ నుంచి డాల్బీ, రీల్ నుంచి డిజిటల్.. ఇలా సినిమా అనేక రూపాలు మారింది. ప్రస్తుతం మనిషి జీవితంలో సినిమా ఓ భాగం. సినిమాలో వైవిధ్యం, వేగం ప్రక్షకుల్ని ఆకట్టుకుంది. ఇన్నేళ్లలో సినిమా కేవలం వినోదంలా కాకుండా జనజీవితాల్ని కూడా జాగృతి చేసింది. ఫలితంగా భారతీయ సినిమా ఇప్పటికీ తెరమీద వెలుగులు నింపుతూనే ఉంది.
107 Years for India's first full length feature film #RajaHarishchandra. raja Harishchandra is a silent film Produced and Directed by father of indian cinema, #DadasahebPhalke. It was screened for the public at Coronation cinema in Girgaon, bombay on May 3rd, 1913. pic.twitter.com/t2sRaXOjzp
— BARaju (@baraju_SuperHit) May 3, 2020