2018 సంక్రాంతి పండుగ కానుకగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు పవన్ కళ్యాణ్. ఆయన కెరీర్ 25 సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజ్ఞాతవాసి అప్పట్లో అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత నుండి తన రాజకీయాల్లో పూర్తిగా బిజీ అయిన పవన్, ప్రస్తుతం రెండేళ్ల గ్యాప్ తర్వాత నటిస్తున్న సినిమా వకీల్ సాబ్. అలానే దానితోపాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో కూడా పవన్ మరొక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కాగా వకీల్ సాబ్ సినిమాని దిల్ రాజు, బోనీకపూర్ కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, ఎస్.ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. 

 

ఇటీవల ఈ సినిమా నుండి బయటికి వచ్చిన పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు, మగువా మగువా అనే పల్లవితో సాగే మెలోడీ సాంగ్ శ్రోతలను, ముఖ్యంగా పవన్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. వాస్తవానికి ఈ సినిమాని ఈనెల రెండో వారంలో విడుదల చేయాలని కొన్నాళ్ళ క్రితం సంకల్పించారు నిర్మాతలు. అయితే నెలన్నర నుండి కరోనా మహమ్మారి దెబ్బ వలన మిగతా అన్ని రంగాలతో పాటు సినిమారంగం కూడా బంద్ కావడం, ఎక్కడ షూటింగ్స్ అక్కడే అర్ధాంతరంగా నిలిచిపోవడంతో, వకీల్ సాబ్ షూటింగ్ కూడా నిలుపుదల చేయబడింది. అయితే అందుతున్న సమాచారాన్ని బట్టి ఇప్పట్లో సినిమా షూటింగ్ లకి ప్రభుత్వాలు అనుమతి ఇచ్చే అవకాశం లేదని, ఒకవేళ ఇచ్చినా ఎన్నో రకాల ఆంక్షలు విధించే అవకాశం ఉందని, తద్వారా ఎంతవరకు సినిమాల షూటింగ్ సజావుగా ముందుకు సాగుతాయి అనే ఆందోళన అందరిలోనూ నెలకొందని అంటున్నారు. 

 

అలానే మరో వైపు దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్ కూడా ఆగిపోవడంతో జనవరి కి రావాల్సిన ఈ సినిమాని, సమ్మర్ కి పోస్ట్ పోన్ చేస్తారు అనే వార్తలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. దీనితో మిగతా సినిమాల నిర్మాతలు వెంటనే అలర్ట్ అయ్యారని, మరీ ముఖ్యంగా దిల్ రాజు సంక్రాంతి సీజన్ కావడంతో వకీల్ సాబ్ ని అదే సమయంలో రిలీజ్ చేద్దామని పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఈ ఏడాది కూడా పవన్ కళ్యాణ్ నుండి సినిమా రానట్లే అని, ఒక రకంగా పవన్ ఫ్యాన్స్ కు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి......!!

మరింత సమాచారం తెలుసుకోండి: