ఉయ్యాలా జంపాలా ద్వారా తెలుగు తెరకి పరిచయం అయిన రాజ్ తరుణ్ ఆ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. అన్నపూర్ణ స్టూడియో నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం రాజ్ తరుణ్ కి శుభారంభాన్ని ఇచ్చింది. దాని తర్వాత కుమారి ౨౧ ఎఫ్ సినిమాతో మరో విజయం ఖాతాలో చేరడంతో మినిమమ్ గ్యారెంటీ హీరో అనిపించుకున్నాడు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ ఒకేలా ఉండదు.

 

 

ఒక శుక్రవారం వారి జీవితాలని ఎక్కడికో తీసుకెళ్తే, మరో శుక్రవారం అధఃపాతాళంలోకి తీసుకెళ్తాయి. అలా సినిమా ఇండస్ట్రీలో తెరమరుగైన హీరోలెంతో మంది ఉన్నారు. ప్రస్తుతం రాజ్ తరుణ్ అలాంటి గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు. ఆయన చేసిన చిత్రాలేవీ విజయం సాధించకపోవడంతో రాజ్ తరుణ్ మార్కెట్ బాగా దెబ్బతింది. మొన్నటికి మొన్న దిల్ రాజు నిర్మాతగా వచ్చిన ఇద్దరిలోకం ఒకటే సినిమా కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకుని రాజ్ తరుణ్ కి నిరాశని మిగిల్చింది.

 

ఇద్దరిలోకం ఒకటే తర్వాత విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో ఒరేయ్ బుజ్జిగా సినిమా రూపొందింది. మార్చి నెలలో ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా లాక్డౌన్ వల్ల ఈ చిత్ర రిలీజ్ వాయిదా పడింది. థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియదు కాబట్టి ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో చెప్పలేం. రాజ్ తరుణ్ కెరీర్ సాఫీగా సాగాలంటే ఈ సినిమా విజయం అవ్వాల్సిందే.

 

అయితే ఈ సినిమా ఇంకా రిలీజవ్వక ముందే రాజ్ తరుణ్ కి మరో సినిమాలో అవకాశం వచ్చిందని అంటున్నారు. నాగచైతన్య, సమంతలు గత కొన్ని రోజులుగా ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దామనుకుంటున్న సంగతి తెలిసిందే. చైతన్య నిర్మాతగా స్టార్ట్ చేయబోయే మొదటి సినిమాలో రాజ్ తరుణ్ ని హీరోగా తీసుకోనున్నారట. ఈ వార్త నిజమైతే రాజ్ తరుణ్ నిజంగా లక్కీనే..

మరింత సమాచారం తెలుసుకోండి: