తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేసిన దర్శకుడు రాజమౌళి. అందుకే ఆయన దర్శకధీరుడయ్యాడు. ఆయన సినిమాల విషయంలో ఎంత పర్ఫెక్టుగా ఉంటాడో జక్కన్న సినిమాలను ఫాలో అయితే అర్థం అవుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్ - రామ్ చరణ్ లతో భారీ మల్టీస్టారర్ 'ఆర్.ఆర్.ఆర్' తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 'ఆర్ ఆర్ ఆర్' సినిమా తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తన తదుపరి సినిమా ఎవరితో అనే సస్పెన్స్కు తెరపడింది. 'ఆర్ఆర్ఆర్' తర్వాత తాను దర్శకత్వం వహించనున్న చిత్రంలో మహేశ్బాబు హీరోగా నటించబోతున్నట్లు రాజమౌళి స్వయంగా వెల్లడించారు. సూపర్ స్టార్ మహేష్ - జక్కన్న దాదాపు ఇరవై ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తున్నప్పటికీ వీరిద్దరి కాంబినేషన్ మాత్రం కుదరలేదు. పదేళ్ల క్రితం వీరిద్దరి మధ్య మొదలైన చర్చలు ఇప్పుడు కార్యరూపం దాల్చబోతున్నాయి. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే.ఎల్ నారాయణ నిర్మాతగా తెరకెక్కనున్న ఈ చిత్రం 2021 ఇయర్ ఎండింగ్ లేదా 2022 ఫస్ట్ హాఫ్ లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా తన కలల ప్రాజెక్టు మహాభారతం గురించి ఇప్పటికే పలుమార్లు మాట్లాడాడు రాజమౌళి. ఆ సినిమా తీయడానికి పదేళ్లు పడుతుందని జక్కన్న చెప్పి నాలుగైదేళ్లు కావస్తోంది. ప్రస్తుతం చేస్తున్న ఆర్ఆర్ఆర్.. ఆ తర్వాత మహేష్ బాబుతో చేయబోయే సినిమా పూర్తయ్యే సమయానికి మహాభారతం చేసేందుకు ముహూర్తం కుదురుతుందేమో.. అప్పుడు మొదలుపెడితే.. జక్కన్న ముందు ప్రకటన చేసినప్పటి నుంచి పదేళ్లకు మహాభారతం సినిమాలో ఒక పార్ట్ ప్రేక్షకుల ముందుకు వస్తుందేమో అని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా రాజమౌళి ఖాళీగా ఉంటున్న నేపథ్యంలో మహాభారతం మీద వర్క్ ఏమైనా మొదలుపెట్టారేమో అన్న ఆలోచనా కలుగుతోంది.
ఇటీవల రాజమౌళి మేక్ రామాయణం అంటూ ఉత్తరాది జనాలు ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేయడం.. దీని మీద పెద్ద చర్చ నడవడం తెలిసిన సంగతే. ఈ నేపథ్యంలో జక్కన్నను తన కలల ప్రాజెక్టు గురించి అడిగితే.. మహాభారతం పనులు మొదలుపెట్టాల్సిందే అని.. కానీ దానికి ఇంకా కొంచెం సమయం పడుతుందని చెప్పాడు. ఇప్పుడు ఖాళీ దొరికింది కదా అని దాని మీద కూర్చుని పని చేసే ప్రాజెక్టు ఇది కాదని జక్కన్న స్పష్టం చేశాడు. మొత్తం మీద ఈ సినిమా పట్టాలెక్కడానికి ఇంకా కొన్నేళ్లు వెయిట్ చేయాలని అర్థం అవుతోంది.