నేడు విశాఖ లో చోటుచేసుకున్న అతిఘోరమైన గ్యాస్ లీకేజ్ లో 12 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 120 మంది ఆసుపత్రి పాలవగా దేశవ్యాప్తంగా ఈ విషయం ఈ రోజు ఒక పెద్ద సంచలనంగా మారింది. అయితే ప్రతిరోజూ కొన్ని వందల మంది ప్రాణాలను బలి తీసుకున్న కరోనా వైరస్ నుంచి ప్రజల దృష్టి ఈరోజు కొద్దిగా మళ్ళింది. ఇక ఈ రోజు నమోదైన కేసుల వివరాల్లోకి వస్తే...
భారత్లో గత 24 గంటల్లో 3,561 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల్లో కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అయితే.. కొత్తగా తమిళనాడులో కూడా రోజుకు 500 కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటం కలవరపాటుకు గురిచేసే అంశం.
ఇతర దేశాలతో పోల్చితే భారత్లో రికవరీ రేటు మెరుగ్గా ఉందని, మరణాల రేటు కూడా తక్కువగానే ఉందని మంత్రి చెప్పారు. భారత్లో ప్రస్తుతం రికవరీ రేటు 28.83 శాతంగా ఉందని, మరణాల రేటు 3.3గా ఉందని హర్షవర్ధన్ తెలిపారు.
ఇక ప్రపంచ వ్యాప్తంగా గత నెలలో ప్రతి రోజూ సగటున 80 వేల చొప్పున కరోనా కేసులు నమోదైనట్లు చెప్పారు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనమ్. అనేక దేశాల్లో వైరస్ వ్యాప్తి విజృంభణ కొనసాగుతూనే ఉందని అన్నారు. కొద్ది రోజులుగా వెస్ట్రన్ యూరప్ దేశాల్లో కేసులు క్రమంగా తగ్గుతున్నాయని, భారత్, బంగ్లాదేశ్ వంటి దక్షిణాసియా దేశాల్లో భారీగా పెరుగుతున్నాయని చెప్పారు.