దేశంలో కరోనా మహమ్మారి వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో రోజూ చూస్తూనే ఉన్నాం. ఓ వైపు ప్రాణ నష్టం.. మరోవైపు ఆర్థిక నష్టం. అయితే కరోనా దేశంలో మొదలైనప్పటి నుంచి ఎక్కువగా సినీ పరిశ్రమపై దీని ప్రభావం చూపించింది. అన్ని షూటింగ్స్ ఆగిపోయాయి.. కోట్ల పెట్టుబడులు స్తంభించిపోయాయి. ఇక సినిమాల రిలీజ్ లు కూడా పోస్ట్ పోన్ అయ్యాయి. దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో థియేటర్లు, మాల్స్ మూతపడ్డాయి. మొత్తానికి సినీ రంగం అంతా ఒక్కసారే కుదేలైంది. లాక్ డౌన్ కారణంగా సెలబ్రెటీలు అంతా ఇంటికే పరిమితం అయ్యారు. కరోనా ఒకరి నుంచి ఒకరికి సోకుతుందని భౌతిక దూరం పాటించాలని.. మాస్క్ ధరించాలని చెబుతున్నారు. దాంతో ఎక్కడా షూటింగ్ జరగకుండా బంద్ చేశారు.
తాజాగా ఇప్పుడు దేశ వ్యాప్తంగా గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లుగా విభజించిన విషయం తెలిసిందే. తాజాగా తమిళ చిత్ర సీమకు అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమాలకు పోస్టు ప్రొడక్షన్ పనులు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. లాక్ డౌన్ కి ముందు కొన్ని సినిమా షూటింగ్స్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ కారణంగా దాదాపు రూ.500 కోట్ల మేర పెట్టుబడులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని, పోస్టు ప్రొడక్షన్ పనులకు అనుమతించాలని కోరుతూ ఇటీవల తమిళ నిర్మాతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
స్పందించిన ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 11 నుంచి టీవీ, సినిమాలకు సంబంధించిన పోస్టు ప్రొడక్షన్ పనులు చేసుకోవచ్చంటూ నిన్న ఉత్తర్వులు విడుదల చేసింది.గరిష్ఠంగా ఐదుగురితో ఎడిటింగ్, డబ్బింగ్, డీఐ, రీ రికార్డింగ్ సౌండ్ డిజైన్ /మిక్సింగ్ పనులు చేసుకోవచ్చని, వీఎఫ్ఎక్స్/సీజీఐ పనుల కోసం గరిష్టంగా 15 మందిని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. పోస్టు ప్రొడక్షన్ పనులకు అనుమతినిచ్చిన ప్రభుత్వానికి నిర్మాతలు కృతజ్ఞతలు తెలిపారు.