టాలీవుడ్ చరిత్రలో డైరెక్టర్ దాసరి నారాయణ రావు కి ప్రత్యేక స్థానం ఉంది. 150 సినిమాలు డైరెక్ట్ చేసి ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం చేసిన డైరెక్టర్ గా రికార్డ్ సాధించారు. తెలుగులో దర్శకుడిగా ఆయన అందుకున్న శిఖర స్థాయిని అప్పటికి మరే డైరెక్టర్ అందుకోలేదంటే అతిశయోక్తి కాదు. కేవలం పోస్టర్ మీద ఆయన పేరు చూసి సినిమా థియేటర్ కి పోటెత్తేవారు ప్రేక్షకులు. దాసరి గొప్పదనం కేవలం సినిమాలు తీయడంలోనే లేదు. పరిశ్రమకు పెద్దగా చాలా ఏళ్ల పాటు అందరికీ అండగా నిలిచారు. ఎంతోమందికి సాయం చేశారు. ఎన్నో సమస్యలు పరిష్కరించారు. ఇండస్ట్రీలో ఆయన మాట శాసనం అన్నట్లుండేది. ఈ విషయంలో దాసరి గొప్పదనం ఆయన వెళ్లిపోయాకే అందరికీ తెలిసి వచ్చింది. పరిశ్రమలో అందరూ ఒక కుటుంబ పెద్దను కోల్పోయిన భావనకు వచ్చారు. ఐతే దాసరి మరణానంతరం ఆయన స్థానంలో వెళ్లడానికి కొన్నేళ్లు ఎవ్వరూ సాహసించలేదు. ఎందుకంటే అది కేవలం హోదాను అనుభవించే స్థానం కాదు. ఇండస్ట్రీకి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ నిలబడాలి. సమస్యలు వస్తే పరిష్కరించాలి. సాయానికి ముందు నిలబడాలి. అందుకే ఆ స్థానాన్ని మొదట్లో ఎవ్వరూ తీసుకోలేదు. కానీ తర్వాత మెగాస్టార్ నెమ్మదిగా దాసరి స్థానంలోకి వచ్చారు.

 

దాసరి స్థాయిలో కాకపోయినా చిరు కూడా తన స్థాయిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం కరోనా క్రైసిస్ చారిటీ పేరుతో ఆయన ఇండస్ట్రీని ముందుండి నడిపిస్తూ కార్మికులకు సాయం చేస్తున్న వైనం ప్రశంసలందుకుంటోంది. అయితే చిరు కంటే సీనియర్లు ఇండస్ట్రీలో ఉన్న ఆయనే ఈ ‘పెద్ద’ పాత్ర పోషిస్తుండటం పట్ల కొందరికి అభ్యంతరాలుండొచ్చు. కానీ దాసరి స్థానంలోకి రావడానికి తనకంటే ఆయన శిష్యుడు మోహన్ బాబు అర్హుడని చిరు భావించారట. చిరుతో పాటు కృష్ణంరాజు కూడా అదే అభిప్రాయంతో.. మోహన్ బాబును ‘పెద్దన్న’ పాత్ర పోషించమని అడిగారట. కానీ ఆయన తిరస్కరించారట. ఇది రూమర్ అని కొట్టి పారేయడానికి వీల్లేదు. ఎందుకంటే స్వయంగా మోహన్ బాబే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఏదేమైనా ఒకరిద్దరు అని కాకుండా అందరూ పెద్దన్న పాత్ర పోషించి సినీ ఇండస్ట్రీకి మేలు జరిగే నిర్ణయాలు తీసుకుంటే టాలీవుడ్ ఎప్పటికి నిలిచిపోతుందని సినీ అభిమానులు ఆశిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: