రెండేళ్ల క్రితం కన్నడతో పాటు మన దేశవ్యాప్తంగా పలు ఇతర భాషల్లో కూడా రిలీజ్ అయి అత్యద్భుత విజయాన్ని అందుకున్న సినిమా కెజిఎఫ్ చాప్టర్ 1. కన్నడ రాక్ స్టార్ యాష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా హోంబలే ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎంతో భారీ ఎత్తున నిర్మితం అయిన ఈ సినిమా తరువాత దానికి కొనసాగింపుగా ప్రస్తుతం చాప్టర్ 2 ని తీస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతున్న ఈ సినిమా అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రావలసి ఉండగా, ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ వలన సినిమా షూటింగ్స్ నిలిచిపోవడంతో ఆ సినిమా జనవరికి వాయిదా పడినట్లు టాక్. 

 

ఇకపోతే ఆ సినిమా తరువాత దర్శకుడు ప్రశాంత్ నీల్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తన నెక్స్ట్ సినిమాని తీయనున్నారు. మొన్న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ చేసిన పోస్ట్ ని బట్టి వారిద్దరి కాంబోలో రాబోయే సినిమాపై క్లారిటీ రావడం జరిగింది. ఇప్పటికే ఆ సినిమా కోసం ఒక అద్భుతమైన కథని సిద్ధం చేసిన ప్రశాంత్, అతి త్వరలోనే దానిని ఎన్టీఆర్ కి వినిపించనున్నారట. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఎంతో భారీ ఎత్తున నిర్మించనున్న ఈ సినిమాని వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ప్రారంభించే అవకాశం కనపడుతోంది. 

 

కాగా కొన్నాళ్ల క్రితం దర్శకుడు ప్రశాంత్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ను కూడా ఒకానొక సందర్భంలో కలిసి ఒక పవర్ఫుల్ స్టోరీ లైన్ ని వినిపించారని, అది ఎంతో నచ్చిన మహేష్, ఆ కథ యొక్క పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కాగా ఆ వార్త నిజమే అని, ఇప్పటికే ఎన్టీఆర్ సినిమా స్టోరీ సిద్ధం చేసిన ప్రశాంత్, మరోవైపు మహేష్ తో చేయబోయే సినిమా కథ కోసం కూడా తన టీమ్ తో కసరత్తులు చేస్తున్నారని వినికిడి. అన్నీ కలిసివస్తే వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం కూడా లేకపోలేదని గుసగుసలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజం అయితే, ముందు ఎన్టీఆర్ తో, ఆ తరువాత మహేష్ బాబుతో ప్రశాంత్ నీల్ కు మంచి అవకాశాలు దక్కినట్లే మరి.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: