ఇప్పుడు తెలుగు హీరోలు చాలా మంది వ్యాపారాల మీద ఎక్కువగా దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. వ్యాపారాల మీద మంచి లాభం ఉన్న నేపధ్యంలో హీరోలు అందరూ కూడా ఏదోక వ్యాపారం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అగ్ర హీరోలు అందరూ కూడా ఇప్పుడు ఎక్కువగా వ్యాపారాల మీదనే ఫోకస్ చేస్తూ వస్తున్నారు. టాలీవుడ్ లో నిన్నటి తరం హీరోల్లో ఎప్పుడో శోభన్ బాబు, మురళీ మోహన్ నుంచే ఏదో ఒక వ్యాపారం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇక ఈ నేపధ్యంలోనే టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడని సమాచారం.
ఎన్టీఆర్ తో కలిసి వ్యవసాయం చేయడానికి గానూ దాదాపు 300 ఎకరాల భూమిని కౌలుకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం. చెర్రీ ఇప్పటికే అనేక వ్యాపారాల్లో భారీగా పెట్టు బడులు పెట్టి ఉన్నాడు. అటు విమాన యాన రంగంతో పాటు ఇటు హాస్పటల్ బిజినెస్.. ఇక షేర్స్.. రేసు గుర్రాల్లో కూడా మనోడు పెట్టుబడులు పెడతాడన్న టాక్ ఉంది. ఇక ఇప్పుడు రంగారెడ్డి జిల్లా లేదా మహబూబ్ నగర్ వద్ద ఈ భూమిని కొందరు రైతుల వద్ద తీసుకునే సూచనలు ఉన్నాయి. దీనిలో ఆర్గానిక్ వ్యవసాయం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.
దీనికి సంబంధించి ఉపాసనా ఇప్పటికే రామ్ చరణ్ తరుపున ప్రయత్నాలు మొదలు పెట్టారని అంటున్నారు. ఆమె తన తండ్రి తో కలిసి ఈ విషయం గురించి చర్చలు కూడా జరిపారని ఆయన కూడా అందుకు ఓకే చెప్పారని అంటున్నారు. దీనిపై త్వరలోనే వీళ్ళు ఇద్దరూ కలిసి భూమి ఉన్న ప్రాంతానికి వెళ్ళే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరి ఎన్ని ఎకరాల్లో వ్యవసాయం చేస్తారు ఏ విధమైన వ్యవసాయం చేస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది. ఇక వీరిద్దరు కలిసి రాజమౌళి దర్శకత్వంలో చేస్తోన్న ఆర్.ఆర్.ఆర్ తో మంచి మిత్రులు అయిపోయారు.