ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన గత రెండు నెలలుగా చిత్ర పరిశ్రమ క్లోజ్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సినీ ప్రముఖులు తెలంగాణా సీఎం కేసీఆర్‌ తో భేటీ అయ్యారు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధర్వంలో చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్‌, ఎస్.ఎస్‌. రాజమౌళి, దిల్‌రాజు, సురేశ్‌బాబు, మెహర్‌ రమేశ్‌, ఎన్‌. శంకర్‌, రాధాకృష్ణ, సి.కల్యాణ్‌, కొరటాల శివ, త్రివిక్రమ్‌, జెమిని కిరణ్‌, ప్రవీణ్‌బాబు తదితరులు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాలను వారు సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకొచ్చారు. అదే విధంగా సినీ పరిశ్రమలోని కార్మికుల కోసం చేపట్టిన సహాయక చర్యలను వివరించారు. సినిమా షూటింగులు, నిర్మాణానంతర కార్యక్రమాలు, సినిమా థియేటర్ల ప్రారంభం తదితర అంశాలపై చర్చించారు. సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వాలని.. థియేటర్లు తెరిచే అవకాశం ఇవ్వాలని సినీ రంగ ప్రముఖులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. సినిమా పరిశ్రమపై ఆధారపడి లక్షల మంది జీవిస్తున్నారని, ప్రొడక్షన్‌ వర్క్‌, షూటింగ్‌లు, థియేటర్లలో ప్రదర్శనలను దశలవారీగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. తక్కువ మందితో, ఇండోర్‌ లో చేసే వీలున్న రీ ప్రొడక్షన్ పనులు మొదట ప్రారంభించుకోవాలని సీఎం సూచించారు. జూన్‌ లో సినిమా షూటింగులు ప్రారంభించాలని చెప్పారు. పరిస్థితిని బట్టి సినిమా థియేటర్ల ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

 

సీఎం మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ బతకాలని అదే సందర్భంగా మహమ్మారి వ్యాప్తి కూడా జరగవద్దని అన్నారు. అందుకోసం సినిమా షూటింగులను వీలైనంత తక్కువ మందితో నిబంధనలు పాటిస్తూ, మహమ్మారి వ్యాప్తి నివారణకు అనుసరిస్తున్న మార్గదర్శకాల ప్రకారం నిర్వహించుకోవాలని చెప్పారు. ఎంతమందితో షూటింగులు నిర్వహించుకోవాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. తదితర అంశాలపై సినిమాటోగ్రఫీ మినిస్టర్ మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమై చర్చించాలని టాలీవుడ్ ప్రముఖులను ముఖ్యమంత్రి కోరారు. ఆ తర్వాత ప్రభుత్వం ఖచ్చితమైన మార్గదర్శకాలు రూపొందించి షూటింగులకు అనుమతి ఇస్తుందని వెల్లడించారు. కొద్ది రోజులు షూటింగులు నడిచిన తర్వాత పరిస్థితిపై కొంత అంచనా వస్తుంది కాబట్టి సినిమా థియేటర్లు ఓపెన్ చేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్‌ చెప్పారు. సినిమా షూటింగ్‌ లపై సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్‌ కు అగ్ర కథానాయకులు చిరంజీవి నాగార్జున కృతజ్ఞతలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: