ఈ మద్య సినీ పరిశ్రమలో వరుస విశాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్, కామెడియన్ హరికిషన్(57) కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం సికింద్రాబాద్ లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన పిల్లలు ఆస్ట్రేలియాలో ఉండటంతో వాళ్లు వచ్చేందుకు ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో బాడీని మార్చురీకి తరలించారు. ప్రస్తుతం దేశంలో కరోనా వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.. దూర ప్రయాణాలు సాగడం లేదన్న విషయం తెలిసిందే. ఆ మద్య బాలీవుడ్ నటులు ఇర్ఫాన్ ఖాన్, సీనియర్ నటులు రిషీ కపూర్ కన్నుమూసిన విషయం తెలిసిందే. వారి అంత్యక్రియలు కూడా షర వేగంగా జరిగిపోయాయి.
టాలీవుడ్ లో సీనియర్ ఎన్టీఆర్ జనరేషన్ నుంచి చిరంజీవి జనరేషన్.. ప్రస్తుత యూత్ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ వరకు అందరి ఇమిటేట్ చెయ్యగల మిమిక్రీ కళాకారుడు హరి కిషన్. ఒక్క సినీ రంగానికి చెందిన హీరోలు మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాల్లో మాజీ, ప్రస్తుత ముఖ్యమంత్రులు.. ఎన్టీఆర్, వైయస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్, జగన్ ల గొంతులను కూడా అచ్చుగుద్దినట్టు మిమిక్రీ చేయగలరు ఈయన. కాగా హరికిషన్.. మే 30, 1963 తేదీన శ్రీమతి రంగమణి, వి.ఎల్.ఎన్ చార్యులు దంపతులకు ఏలూరులో జన్మించారు. చిన్నప్పటి నుంచే.. తన స్నేహితుల, గురువుల గొంతులను మిమిక్రీ చేయడం ప్రారంభించారు హరికిషన్.
అలా ప్రారంభమైన హరికిషన్ మిమిక్రీ కెరీర్… ఆ తర్వాత దేశవిదేశాల్లో వందల కొద్దీ స్టేజ్ షోలు ఇచ్చేవరకు వెళ్లింది. హరికిషన్ ప్రముఖ నటుడు శివారెడ్డి మరికొంత మంది పాపులర్ మిమిక్రీ ఆర్టిస్టులకు గురువు. ఎంతో మంది కళాకారులను ఆయన తయారు చేశారు.. ప్రోత్సహించారు. 12 ఏళ్ల పాటు టీచర్గా పనిచేసి, ఆ తర్వాత.. హైదరాబాద్లోని పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో మిమిక్రీ లెక్చరర్గా పనిచేశారు. ఇండస్ట్రీతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకున్న హరికిషన్ మరణం పట్ల టాలీవుడ్ సంతాపం వ్యక్తం చేసింది.