కరోనా వల్ల దేశంలో ఎన్నో రంగాలకు విపరీతమైన నష్టం అన్నీ రంగాలకు వాటిల్లగా.... వాటిలో ప్రప్రధమంగా చిత్ర పరిశ్రమ గురించి మనం చెప్పుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఒక్క టాలీవుడ్ కే ఈ లాక్ డౌన్ కారణంగా ఐదు వందల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది అంటే పరిశ్రమ పై లాక్ డౌన్ ప్రభావం ఎలా పడీందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నో లక్షలమంది చిత్ర పరిశ్రమ కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. పదుల సంఖ్యలో సినిమాల షూటింగ్ ఆగిపోయింది. చాలా సినిమాలు ఇక ఈ సమస్యలను భరించలేక విడుదల ను రద్దు చేసుకుని ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ వైపు మొగ్గు చూపారు.
ప్రస్తుతం జనాలు ఎక్కువగా స్మార్ట్ఫోన్లకు అలవాటు పడడం.. ఓటీటీ యాప్లలో సిరీస్, సినిమాలు ఎక్కువగా చూస్తుండడంతో.. సినీ నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీ యాప్లలో విడుదల చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఓటీటీల్లో సినిమాలను రిలీజ్ చేస్తే తమ పరిస్థితి ఏమిటని.. థియేటర్లు, మల్టీప్లెక్సుల యాజమాన్యాలు నిర్మాతలను ప్రశ్నిస్తున్నాయి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో నిర్మాతలు ఆ పనిచేయక తప్పదని వారికి కూడా తెలుసు.
పెద్ద హీరోల చిత్రాలకు కచ్చితంగా వసూళ్ళు వస్తాయి కానీ మీడియం బడ్జెట్ సినిమాలు మరియు చిన్న సినిమాలను ఒక నెల అయితే మన ల్యాప్ టాప్ లేదా టీవీ లో ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ మరియు యాప్స్ ద్వారా చూసుకోవచ్చని జనాలు థియేటర్లకు వెళ్లడం మానేశారు. అంతే కాదు స్టార్ హీరోల సినిమాలను రిపీట్స్ లో థియేటర్స్ లో వీక్షించే వారి సంఖ్య కూడా గణణీయంగా పడిపోయింది అంటే అతిశయోక్తి కాదు.
ఇక థియేటర్ల విషయానికి వస్తే కరోనా తర్వాత ఎవరూ ధైర్యం చేసి మునుపటిలా సినిమా హాళ్ళకు మరియు మల్టీప్లెక్స్ లకు వెళ్లే పరిస్థితి అయితే లేదు. అదీ కాకుండా ఇంట్లోనే హాయిగా కూర్చుని తమకు నచ్చిన సిరీస్ ను లేదా సినిమాను స్మార్ట్ టీవీ లో చూడటానికే ప్రజలు క్రమేపీ మొగ్గుచూపుతున్నారు. దీంతో థియేటర్లకు మరలా పూర్వ వైభవం వచ్చే అవకాశం కష్టమనే చెప్పాలి.